న్యూఢిల్లీ : పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసెవాల హత్యపై రాష్ట్రంలో విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. భగవంత్ మాన్ సారధ్యంలోని ఆప్ సర్కార్ హత్యకు పాల్పడిన దోషులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందని చెప్పారు.
పటియాలా హింస, మొహాలి బాంబు పేలుళ్ల కేసులను కేవలం 24 నుంచి 48 గంటల్లో భగవంత్ మాన్ సర్కార్ చేధించిందని గుర్తుచేశారు. జరిగిన ఘటనపై రాజకీయాలు చేయడం తగదని తాను నమ్ముతానని అన్నారు. సిద్ధూ మూసే వాల హత్యను ఖండించాల్సిందేనని వ్యాఖ్యానించారు.
దోషులను అరెస్ట్ చేసి న్యాయం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని పంజాబ్ సీఎం ఇప్పటికే స్పష్టం చేశారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా సత్వర చర్యలు తీసుకునేందుకు కొత్త ప్రభుత్వం చొరవ చూపుతున్నదని అన్నారు. పంజాబ్ను ముందుకు తీసుకువెళ్లడంలో విపక్షాలు కలిసిరావాలని, దురదృష్టకర ఘటనలను రాజకీయం చేసేందుకు కాదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.