తేజ్పూర్: అరుణాచల్ప్రదేశ్లో ఆర్మీ హెలికాప్టర్ కూలిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ప్రమాదంలో మరణించిన ఐదో జవాన్ మృతదేహం కూడా లభ్యం కావడంతో రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ను ముగిస్తున్నట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. శుక్రవారం ఉదయం లోయర్ సియాంగ్ జిల్లాలోని లికబలి నుంచి బయలుదేరిన హెలికాప్టర్ 10:43 గంటలకు మిగ్గింగ్ గ్రామంలో కుప్పకూలింది.
ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఐదుగురు జవాన్లు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే ఒక మిగ్-17 విమానం, రెండు హెలికాప్టర్లతో ఏరియల్ రెస్క్యూ టీమ్స్ ఘటనా ప్రాంతానికి వెళ్లాయి. ప్రమాదం జరిగిన ప్రదేశానికి రోడ్డు మార్గం లేకపోవడంతో మూడు ఆర్మీ బృందాలు కాలినడకన అక్కడికి చేరుకున్నాయి.
శుక్రవారం మధ్యాహ్నానికి రెండు మృతదేహాలు లభ్యంకాగా మిగిలిన ముగ్గురి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఆ తర్వాత మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో జవాన్ కోసం ఇవాళ కూడా రెస్క్యూ నిర్వహించగా ఈ సాయంత్రం అతని మృతదేహం లభ్యమైంది. దాంతో ఆర్మీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ను ముగించారు.