Article 370 | జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించింది. ఆగస్ట్ 2వ తేదీ నుంచి పిటిషన్లపై విచారణను ప్రారంభించనున్నట్లు మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. అలాగే రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ఆయా పిటిషన్లను విచారించనున్నది. అయితే, ఎవరైనా పిటిషన్లపై వాదనలు వినిపించాలనుకున్నా, అభిప్రాయాలు చెప్పాలన్నా ఈ నెల రాతపూర్వకంగా సమాచారం ఇవ్వాలని సీజేఐ కోరారు. ఆ తర్వాత మాత్రం ఎలాంటి అభ్యర్ధనలు స్వీకరించబోమన్నారు.
2019, ఆగస్ట్ 5న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఎలను రద్దు చేసింది. రాష్ట్రం హోదాను తొలగిస్తూ జమ్మూకశ్మీర్, లఢఖ్గా విభజించింది. ఆ తర్వాత పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టగా.. రాష్ట్రాన్ని విభజించడానికి జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి ఆమోదం లభించింది. అయితే, జమ్మూ కాశ్మీర్ ప్రజల సమ్మతి లేకుండా పార్లమెంట్ ఆర్టికల్ 370ని రద్దు చేయగలదా..? రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం రాజ్యాంగంపరంగా సరైందేనా..? కోర్టు విచారించనున్నది.
సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్, లఢక్లో శాంతికి దారి తీసిందని పేర్కొన్నారు. గత మూడు దశాబ్దాలుగా జమ్మూకశ్మీర్ తీవ్రవాదాన్ని ఎదుర్కొంటోందని, దాన్ని అరికట్టాలటే ఆర్టికల్ 370ని తొలగించడమే ఏకైక మార్గమని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అఫిడవిట్లో పేర్కొంది. నేడు పాఠశాలలు, కళాశాలలు, పరిశ్రమలు సహా అన్ని అవసరమైన సంస్థలు లోయలో సాధారణంగా నడుస్తున్నాయని, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోందని, భయం నీడలో బతికిన ప్రజలు ప్రశాంత జీవనం గడుపుతున్నారని తెలిపింది.
జమ్మూకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370పై దాఖలైన పిటిషన్లపై చివరిసారిగా మార్చి 2020లో సుప్రీంకోర్టులోని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ విచారించింది. ఈ కేసుకు సంబంధించిన పిటిషన్లను ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్కి ఇవ్వాలన్న పిటిషనర్ల వాదనలను అంగీకరించేందుకు నిరాకరించింది.
ఆర్టికల్ 370కి సంబంధించిన వివరణతో కూడిన ప్రేమ్ నాథ్ కౌల్ కేసు, సంపత్ ప్రకాశ్ కేసుల్లో అత్యున్నత న్యాయస్థానం గతంలో వెలువరించిన తీర్పులు పరస్పర విరుద్ధంగా లేవని అప్పటి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టతనిచ్చింది. అయితే, రాష్ట్రంలో అసెంబ్లీ లేని సమయంలో రాష్ట్రపతి పాలన విధించారని, ఆ తర్వాత ఆర్టికల్ 370ని రద్దు చేయడం ప్రజల ప్రజాస్వామ్య హక్కులను ఉల్లంఘించడమేనని పిటిషన్లు ఆరోపించారు.