జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. భారత్లో విలీనం తర్వాత జమ్ముకశ్మీర్కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని స్పష్టంచేసింది. ఆర్టికల్ 370 తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉన్నదని తెలిపింది. ఈ మేరకు ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేసింది.
Supreme Court | న్యూఢిల్లీ, డిసెంబర్ 11: పూర్వపు జమ్ముకశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం ఏకగ్రీవంగా తీర్పును ప్రకటించింది. జమ్ముకశ్మీర్ నుంచి లఢక్ను విభజించి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని కూడా సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. అయితే కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్ముకశ్మీర్కు వీలైనంత త్వరగా రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వచ్చే ఏడాది సెప్టెంబర్ 30లోగా అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని గడువు విధించింది. జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడంపై దశాబ్దాలపాటు కొనసాగిన చర్చకు ఈ తీర్పుతో సుప్రీంకోర్టు స్వస్తి పలికింది. తీర్పుపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు చారిత్రకమైనదని, పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు రాజ్యాంగబద్ధంగా సమర్థించిందని పేర్కొన్నారు. అయితే జమ్ముకశ్మీర్లోని రాజకీయ పార్టీలు కోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. సుప్రీం తీర్పు తీవ్ర నిరాశకు గురిచేసిందని, అయితే 370 రద్దుపై తమ పోరాటం కొనసాగుతుందని నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పేర్కొన్నాయి.
మూడు వేర్వేరు తీర్పులు..
సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో కూడిన మూడు వేర్వేరు తీర్పులను వెలువరించింది. ఆర్టికల్ 370 కేవలం తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, దానిని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉన్నదని చంద్రచూడ్ పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని కూడా కోర్టు సమర్థించింది.
లఢక్కు తప్ప సాధ్యమైనంత త్వరలో జమ్ముకశ్మీర్కు రాష్ట్రం హోదాను పునరుద్ధరిస్తామన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యాఖ్యలను చంద్రచూడ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆర్టికల్ 3 కింద జమ్ముకశ్మీర్ రాష్ర్టాన్ని జమ్ముకశ్మీర్, లఢక్గా విభజించడం సబబేనా కాదా అన్న అంశాన్ని తేల్చడం అనవసరమని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా కల్పించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ.. మరోవైపు ఆ రాష్ట్ర శాసనసభకు వచ్చే సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించే ప్రక్రియను ప్రారంభించాలని ఎలక్షన్ కమిషన్ను ఆదేశిస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్రపతికి విశేష అధికారాలు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 370(3) కింద రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీచేసి ఆర్టికల్ 370ని రద్దు చేయవచ్చని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్రపతి రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాల సమ్మతిని పొందాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్పై కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాలు చేయలేరని పేర్కొన్నారు. భారత్లో విలీనమైన తరువాత ఆ రాష్ర్టానికి ప్రత్యేక సార్వభౌమాధికారాలు ఉండవని తెలిపారు.
భారత రాజ్యాంగం శిరోధార్యం అని మహరాజా హరిసింగ్ భారత్తో ఒప్పందం సందర్భంగా పేర్కొన్నారని, 1947లో భారత్లో విలీనమైన సందర్భంగా జమ్ముకశ్మీర్కు ఎటువంటి సార్వభౌమాధికారం లేదని గుర్తుచేశారు. అప్పట్లో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టారని అన్నారు. ఇది తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, శాశ్వతం కాదని చెప్పారు. దాన్ని రద్దుచేసే అధికారం రాష్ట్రపతికి ఉన్నదని స్పష్టంచేశారు. హక్కుల విషయంలో జమ్ముకశ్మీర్కు ప్రత్యేకత ఏమీ లేదని, మిగతా రాష్ర్టాలు, యూటీలతో అది సమానమేనని తేల్చి చెప్పారు. ఆర్టికల్ 1, ఆర్టికల్ 370 ప్రకారం జమ్ముకశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు.
మానవహక్కుల ఉల్లంఘనపై దర్యాప్తు
ఇతర రాష్ర్టాలతో సమానంగా తీర్చిదిద్దడం కోసమే జమ్ముకశ్మీర్కు ఆర్టికల్ 370కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారని జస్టిస్ కౌల్ పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్లో 1980 నుంచి ప్రభుత్వ, ప్రభుత్వేర సంస్థల ద్వారా జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలు, హింసాత్మక ఘటనలపై దర్యాప్తుకు ఒక నిష్పక్షపాతమైన కమిషన్ను వేయాలని ఆదేశించారు.జమ్ముకశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం 2019, ఆగస్టు 5న రద్దు చేసింది. అదే రోజున రాష్ర్టాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. దీన్ని వ్యతిరేకిస్తూ జమ్ముకశ్మీర్కు చెందిన పలు పార్టీలు, సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.
ఎన్నికలకు గడువు
జమ్ముకశ్మీర్లో వచ్చే సెప్టెంబర్ 30నాటికి శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది. రాష్ట్ర హోదా కల్పించేంత వరకు ఎన్నికలను వాయిదా వేయడం సహేతుకం కాదని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. సాధ్యమైనంత త్వరగా జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని, ఈలోగా అక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం అత్యంత ప్రాధాన్యమైన అంశమైనందున.. జమ్ముకశ్మీర్ను శాశ్వతంగా కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచరాదంటూ సుప్రీంకోర్టు గతంలో నొక్కిచెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కాగా, ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తమను పోలీసులు హౌస్ అరెస్టు చేశారని జమ్ముకశ్మీర్కు చెందిన పలు పార్టీల నేతలు ఆరోపించారు. అయితే దీన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఖండించారు.
జమ్ముకశ్మీర్ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం
జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు, జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లులను రాజ్యసభ సోమవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. వీటికి లోక్సభ గత వారమే ఆమోదం లభించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో సోమవారం ఈ బిల్లులపై మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఉగ్రవాద రహిత, నూతన, అభివద్ధి చెందిన కశ్మీరుకు ఇది నాంది అని తెలిపారు. 75 ఏళ్ల నుంచి హక్కులను కోల్పోతున్న వారికి ఈ బిల్లుల వల్ల న్యాయం జరుగుతుందన్నారు. నిర్వాసితులకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల శాసనసభలో తమ సమస్యలను చెప్పే అవకాశం వస్తుందన్నారు. ఇదిలావుండగా, కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్ష సభ్యులు హోం మంత్రి ప్రసంగిస్తుండగానే సభ నుంచి వాకౌట్ చేశారు.
ఆర్టికల్ 370 రద్దు పూర్వాపరాలు..
వెంటనేఎన్నికలు జరపాలి
జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను వెంటనే పునరుద్ధరించడంతో పాటు తక్షణం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి. ఆర్టికల్ 370 రద్దు అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేక అంశాలను పరిష్కరించింది. ఇదే సమయంలో కొన్ని అంశాలను వదిలేసింది. తీర్పును సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉన్నది. ఆర్టికల్ 370ని ఎలా రద్దు చేయబడిందనే అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేం ప్రాథమికంగా గౌరవపూర్వకంగా విభేదిస్తున్నాం.
– పీ చిదంబరం, కాంగ్రెస్ నేత
మేం వ్యతిరేకిస్తున్నాం
ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ భారతదేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు చట్టబద్ధమైన విలువ లేదు. ఈ తీర్పును పాకిస్థాన్ తిరస్కరిస్తున్నది. కశ్మీర్ ప్రజలు, పాక్ అభీష్టానికి వ్యతిరేకంగా వివాదాస్పద భూభాగంపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకొనే హక్కు భారత్కు లేదు. 2019, ఆగస్టు 5 నాటి న్యూఢిల్లీ ఏకపక్షమైన, చట్టవిరుద్ధమైన చర్యలను అంతర్జాతీయ చట్టం గుర్తించదు.
-జలీల్ అబ్బాస్ జిలానీ, పాక్ విదేశాంగ మంత్రి
తీర్పు చరిత్రాత్మకం
సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమైనది. 2019, ఆగస్టు 5న పార్లమెంట్ తీసుకొన్న నిర్ణయాన్ని కోర్టు రాజ్యాంగబద్ధంగా సమర్థించింది. జమ్ము, కశ్మీర్, లఢక్ ప్రజల కలలను నెరవేర్చేందుకు నిబద్ధతతో ఉన్నాం. ఈ రోజుటి తీర్పు కేవలం చట్టపరమైనదే కాదు, రానున్న తరాలకు ఇదో ఆశాకిరణం. ఉజ్వలమైన భవిష్యత్తుకు ఒక వాగ్దానం. బలమైన ఐక్యత భారతాన్ని నిర్మించాలనే మన ఉమ్మడి సంకల్పానికి నిదర్శనం.
– ప్రధాని నరేంద్ర మోదీ
వేర్పాటువాదం ఇక గతమే
ఆర్టికల్ 370 రద్దు పూర్తిగా రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్లో శాంతి, సాధారణ పరిస్థితులను తీసుకురాగలిగాం. పేదలు, అణగారిన వర్గాల ప్రజల హక్కులను పునరుద్ధరించాం. వేర్పాటువాదం, రాళ్లు రువ్వడం ఇక గతమే.
– అమిత్షా, కేంద్ర హోమంత్రి
పోరాటానికి సిద్ధం
కోర్టు తీర్పు అసంతృప్తికి గురిచేసింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి బీజేపీకి కొన్ని దశాబ్దాలు పట్టింది. మేం సుదీర్ఘ పోరాటానికి సిద్ధం అవుతాం.
– ఒమర్ అబ్దుల్లా, ఎన్సీ నేత
అంగీకరించక తప్పుదు
సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరం. కానీ, దీన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించక తప్పదు. ఆర్టికల్ 370 చారిత్రక నేపథ్యాన్ని, జమ్ముకశ్మీర్ ప్రజల సెంటిమెంట్ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకొంటుందని అనుకొన్నాం.
– ఆజాద్, డీపీఏపీ అధ్యక్షుడు
మరణశిక్ష వంటిదే
సుప్రీంకోర్టు తీర్పు జమ్ముకశ్మీర్కు మరణ శిక్ష కంటే తక్కువేమీ కాదు. ఇది ముగింపు అనుకోవద్దు. న్యాయస్థానం నిర్ణయం నేపథ్యంలో నిరుత్సాహ పడవద్దని, ఆశలను కోల్పోవద్దని జమ్ముకశ్మీర్, లఢక్ ప్రజలకు కోరుతున్నా.
– ముఫ్తీ, పీడీపీ అధినేత్రి
నిరాశ కలిగించింది
తీర్పు నిరాశ కలిగించింది. 370ని రద్దు చేసిన తీరు రాజ్యాంగ నైతికతను ఉల్లంఘించడమే. కేంద్రం నిర్ణయంతో ఎక్కువగా నష్టపోయేది జమ్ములోని డోగ్రాలు, లడఖ్లోని బౌద్ధులు. 2024 లోక్సభ ఎన్నికలతో పాటు జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి.
– అసదుద్దీన్, ఎంఐఎం అధినేత