న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో అక్కడి నుంచి తమ పౌరులను వెనక్కు తీసుకురావడం పొరుగు దేశాలకు సవాల్గా మారింది. భారత్, అమెరికా సహా పలు దేశాలు ప్రత్యేక విమానాలను పంపించి తమ పౌరులను వెనక్కి రప్పించుకుంటున్నాయి. ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్ నాలుగు రాయబార కార్యాలయాల సిబ్బందిని, పలువురు పౌరులను స్వదేశానికి తీసుకొచ్చింది.
మిగతావారిని కూడా తరలించే ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే ఇవాళ తాలిబన్లు 150 మంది విదేశీ పౌరులను కిడ్నాప్ చేశారని, వారిలో ఎక్కువగా భారతీయులే ఉన్నారని వార్తలు వినిపించాయి. అయితే, తాము ఎవరినీ కిడ్నాప్ చేయలేదని తాలిబన్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మంజిందర్ సింగ్ సిర్సా కూడా ఆఫ్ఘన్లో సిక్కులు క్షేమంగానే ఉన్నారని స్పష్టంచేశారు.
ఆఫ్ఘనిస్థాన్లోని గురుద్వారా పరిసరాల్లో దాదాపు 300 మంది సిక్కులు తలదాచుకున్నారు. ప్రస్తుతం వారంతా క్షేమంగానే ఉన్నారు. వాళ్లలో ఎవరిని ఎవరూ కిడ్నాప్ చేయలేదు. గురుద్వారా నుంచి సిక్కులను కిడ్నాప్ చేశారన్న వార్తలు ఏమైనా వస్తే అవి తప్పుడు వార్తలని ఆయన తెలిపారు.