న్యూఢిల్లీ: పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) చేపట్టి ఏడాది సమీపిస్తున్నది. పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా గత ఏడాది మే 7వ తేదీన భారత బలగాలు పాకిస్థాన్ స్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడి సమయంలో పాకిస్థాన్లో ఉన్న టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేసిన లిస్టులను ఆర్మీ రిలీజ్ చేసింది. మొత్తం ఏడు స్థానాల్లో దాడి చేశారు. ఆ సైట్లకు చెందిన శాటిలైట్ చిత్రాలను ఆర్మీ రిలీజ్ చేసింది. కోట్లి గుల్పుర్, మెహమూనా జోయా, సేద్నా బిలాల్, బింబేర్, స్వాని నాలా, సర్జల్ ప్రాంతాల్లో ఉన్న స్థావరాలపై దాడులు జరిగాయి. మిలిటరీ హెడ్క్వార్టర్స్ ఇచ్చిన టార్గెట్లపై ఆర్మీ దాడి చేసింది. ఇక భారతీయ వైమానిక దళం అదనంగా మరో రెండు స్థావరాలపై అటాక్ చేసింది. మే 7వ తేదీన అర్థరాత్రి ఒంటిగంటకు వైమానిక దాడలు చేశారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఆ దాడి చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. ఆ ప్రతీకార దాడుల నేపథ్యంలో మే 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
పాకిస్థాన్ భూభాగంలో సుమారు 60 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న స్థావరాలను ఆర్మీ టార్గెట్ చేసింది. ఇక వైమానిక దళం మాత్రం మరింత దూరంలో ఉన్న టార్గెట్లపై అటాక్ చేసింది. భారతీయ అమ్ములపొదిలో ఉన్న అత్యాధునిక ఆయుధాలను మే 7వ తేదీ జరిగిన దాడుల్లో వినియోగించారు. బిల్డింగ్లను, క్లస్టర్లను టార్గెట్ చేశారు. ముర్దికే, బవాహల్పుర్లో ఉన్న క్యాంపులను వైమానిక దళం టార్గెట్ చేసింది. మిగితా లొకేషన్లను ఆర్మీ టార్గెట్ చేసింది. అమెరికా తయారీకి చెందిన ఎం777 హోవిజర్ గన్ను ఈ ఆపరేషన్ కోసం ఆర్మీ వాడింది. 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్లను ఆ గన్తో ఎంతో కచ్చితత్వంతో పేల్చగలరు. తమ దాడుల్లో భాగంగా ఆర్మీ కమికేజ్ డ్రోన్లను వాడినట్లు తెలుస్తోంది. నిర్దేశిత టార్గెట్లను వీటితో స్ట్రయిక్ చేశారు. స్వదేశీ, విదేశీ తయారీ సిస్టమ్తో ఆపరేషన్ సింధూర్ నిర్వహించారు.