Army doctor : హైదరాబాదీ అయిన ఆర్మీ డాక్టర్ (Army doctor) రోహిత్ బచ్వాలా (Rohit Bachwala) ను ఇండియన్ ఆర్మీ చీఫ్ (Indian army chief) జనరల్ ఉపేంద్ర ద్వివేది (Gen Upendra Dwivedi) మెచ్చుకున్నారు. రోహిత్ బచ్వాలా వృత్తికి సంబంధించి సమయస్ఫూర్తిని ప్రదర్శించారని, విధి నిర్వహణపట్ల తనకున్న నిస్వార్ధమైన నిబద్ధతను చాటుకున్నారని కొనియాడారు.
రోహిత్ బచ్వాలా ఈ నెల 5న ఝాన్సీలోని మిలిటరీ ఆస్పత్రిలో విధులు ముగించుకుని తన స్వస్థలం హైదరాబాద్కు వచ్చేందుకు ఝాన్సీ రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. అక్కడ హైదరాబాద్కు వెళ్లే రైలు కోసం వేచి ఉండగా.. ఓ మహిళ పురిటి నొప్పులు భరించలేక అల్లాడుతుండటాన్ని గమనించి డెలివరీ చేశారు. ఎలాంటి పరికరాలు లేకున్నా కేవలం హెయిర్ క్లిప్, పాకెట్ నైఫ్తో డెలివరీ చేసి తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడారు. దాంతో వైద్యుడిపై ప్రశంసల ఝల్లు కురుస్తోంది.
అసలేమైందంటే గత శనివారం ఓ గర్భిణి పాన్వెల్-ఘోరఖ్పూర్ రైలులో ప్రయాణిస్తుండగా ఆమెకు తీవ్రమైన పురిటి నొప్పులు వచ్చాయి. దాంతో ఆస్పత్రికి తరలించడం కోసం ఝాన్సీ రైల్వేస్టేషన్లో ఆమెను కిందకు దించారు. రైలు దిగగానే వీల్చైర్లో లిఫ్టు దగ్గరకు తీసుకెళ్లగా నొప్పి తీవ్రమై విలవిల్లాడుతూ ఆమె కింద పడిపోయింది. అది చూసి అక్కడే హైదరాబాద్ వెళ్లే రైలు కోసం వేచిచూస్తున్న ఆర్మీ వైద్యుడు మేజర్ డాక్టర్ రోహిత్ బచ్వాలా (31) స్పందించాడు.
రైల్వే సిబ్బంది సాయంతో ఆమెకు ప్లాట్ఫామ్పైనే అత్యవసరంగా డెలివరీ చేసేందుకు సిద్ధమయ్యాడు. రైల్వే సిబ్బంది తమ దగ్గరున్న సామాగ్రితో చాటు ఏర్పాటు చేయగా.. వైద్యుడు కేవలం హెయిర్ క్లిప్, పాకెట్ నైఫ్తో డెలివరీ చేశాడు. డెలివరీ అనంతరం తల్లీబిడ్డ క్షేమం అని నిర్ధారించుకున్న తర్వాత హెయిర్ క్లిప్తో బొడ్డుతాడును లాక్ చేసి, పాకెట్ నైఫ్తో దాన్ని కత్తిరించాడు. సదరు గర్భిణి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు.
తర్వాత తన రైలు రావడంతో డాక్టర్ రోహిత్ బచ్వాలా హైదరాబాద్కు బయలుదేరాడు. సమయానికి స్పందించి తల్లీబిడ్డల ప్రాణాలు నిలబెట్టిన ఆర్మీ డాక్టర్పై రైల్వే సిబ్బంది, ప్రయాణికులు ప్రశంసలు కురిపించారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కూడా తాజాగా ఆయనను మెచ్చుకున్నారు.