శ్రీనగర్: సైనికులు హింసించి గ్రామస్తులను చంపినట్లు ఆరోపణలకు కేంద్రమైన ఒక గ్రామాన్ని ఆర్మీ దత్తత తీసుకుంది. జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలోని టోపీ పీర్ గ్రామాన్ని దత్తత తీసుకుని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. (Army Adopts Poonch Village) చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు ఆరోపించిన గ్రామస్తులు ఆర్మీ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో స్థానికుల హృదయాలను గెలుచుకునే లక్ష్యంతో సద్భావన కార్యక్రమం కింద ఆర్మీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పీర్ పంజాల్ ప్రాంతంలోని టోపీ పీర్ గ్రామాన్ని ఆర్మీకి చెందిన 16 కార్ప్స్ దత్తత తీసుకుంది.
కాగా, గత ఏడాది డిసెంబర్ 22న టోపీ పీర్ గ్రామం ప్రధానంగా వార్తల్లో నిలిచింది. ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై మెరుపు దాడులు చేశారు. ఈ దాడిలో నలుగురు సైనికులు మరణించగా ఐదుగురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల గురించి ప్రశ్నించేందుకు ఈ గ్రామానికి చెందిన సుమారు 15 మందిని ఆర్మీ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. వారిని చిత్రహింసలకు గురిచేయడంతో ముగ్గురు పౌరులు మరణించారు. బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ సోదరుడు కూడా చనిపోయిన వారిలో ఉన్నాడు. తీవ్రంగా గాయపడిన సుమారు పది మందిలో కొందరు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మరోవైపు గ్రామ ప్రజలను ఆర్మీ చిత్రహింసలకు గురి చేసిన వీడియో క్లిప్ లీక్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆర్మీ సీరియస్గా స్పందించింది. 16 కార్ప్స్ కమాండ్కు చెందిన బ్రిగేడియర్ స్థాయితోపాటు మరో ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులను తొలగించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ గ్రామాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఇలాంటి పొరపాట్లు చేయవద్దని ఆర్మీకి సూచించారు.