ఇంఫాల్, ఆగస్టు 4: మణిపూర్లో మళ్లీ ఆయుధాల లూటీ జరిగింది. అల్లర్లలో మృతిచెందిన కుకీల సామూహిక ఖననం కార్యక్రమం మరోసారి ఆ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలకు దారితీసింది. కాల్పుల మోతతో మారుమోగేలా చేసింది. కుకీల సామూహిక ఖననాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగిన మైతీలు ఆయుధాల లూటీకి పాల్పడ్డారు. సామూహిక ఖననాన్ని అడ్డుకునేందుకు చురాచాంద్పూర్ వైపు వందలాదిగా కదిలిన మైతీలు బిష్ణుపూర్ జిల్లా నరన్సెయినలోని రెండో ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ ప్రధాన కార్యాలయంపై దాడికి దిగారు. ఆయుధాలను కొల్లగొట్టారు. 19 వేల రౌండ్ల బుల్లెట్లు, పలు రకాల తుపాకులు, 124 హ్యాండ్ గ్రెనేడ్లు, 21 కార్బైన్లను దోపిడీకి గురైనట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు పశ్చిమ ఇంఫాల్ జిల్లా కాల్పుల మోతతో దద్దరిల్లింది. మిలిటెంట్లు, ఆర్మీ బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. సెంజం చిరాంగ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఓ పోలీస్ మృతిచెందారు.
25 మందికి గాయాలు
సామూహిక ఖననం కార్యక్రమం జరిగే ప్రాంతానికి వెళ్లేందుకు విఫలయత్నం చేసిన కుకీలు, ఆర్మీ బలగాల మధ్య గురువారం వాగ్వాదం జరిగింది. కుకీలు అక్కడికి వెళ్లకుండా అడ్డుకునేందుకు బలగాలు ప్రయత్నించగా.. కుకీలు వెనక్కి తగ్గలేదు. దీంతో ఆర్మీ, ఆర్ఏఎఫ్ బలగాలు టియర్ గ్యాస్ షెల్స్ను ప్రయోగించాయి. ఈ ఘటనలో సుమారు 25 మందికి గాయాలయ్యాయి.