న్యూఢిల్లీ, మే 21: విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారా? అని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 12వ తరగతి జవాబుపత్రాల స్కాన్డ్ కాపీల కోసం దరఖాస్తు చేసుకుని, వాటిని వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకున్న పలువురు విద్యార్థులు వాటిని చూసి షాక్ తిన్నారు. అస్పష్టంగా అక్షరాలు కన్పించకుండా ఉన్న స్కాన్డ్ కాపీలు చూసి, సీబీఎస్ఈ బోర్డు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము రాసిన జవాబు పత్రాలను తామే చదవలేక పోతున్నామని, ఈ కాపీలను టీచర్లు వాల్యుయేషన్ చేసి మార్కులు ఎలా వేశారని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఈ కాపీలను చూసే మార్కులేశారా? అసలు చదవడానికే వీలుగా లేని ఈ జవాబు పత్రాల ఆధారంగా మేం రీ వాల్యుయేషన్కు ఎలా దరఖాస్తు చేసుకోవాలని వారు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ స్కాన్డ్ కాపీల స్క్రీన్ షాట్లను పలువురు ఎక్స్లో షేర్చేశారు. ప్రభుత్వం చేసిన తప్పునకు పరిహారంగా ప్రతి విద్యార్థికి 15-20 గ్రేస్ మార్కులు కలుపాలని పలువురు డిమాండ్ చేశారు. కాగా, 12వ తరగతి జవాబుపత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువును మే 22 నుంచి 23వ తేదీ వరకు పొడిగించినా వెబ్సైట్లో పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.