భటిండా: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ( Aravind Kejriwal ) పంజాబ్లో సైతం తన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పంజాబ్ ప్రజలపై హామీల వర్షం కురిపించారు. 300 యూనిట్లలోపు కరెంటు వినియోగించే వారికి విద్యుత్ బిల్లుల మాఫీ అనేది అన్నింటికంటే ప్రధానమైన హామీ. కాగా, వచ్చే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఆద్మీ పార్టీదే విజయమని కేజ్రివాల్ ధీమా వ్యక్తంచేశారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని, ఆ వెంటనే మార్చి నెలలో ఫలితాలు వెల్లడవుతాయని కేజ్రివాల్ అంచనా వేశారు. ఏప్రిల్ ఒకటి తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. రాష్ట్రంలోని ట్రేడర్స్ భద్రత పూర్తిగా తమ బాధ్యత అని ఆయన చెప్పారు. నేను ఈ రోజు మీకు గట్టిగా చెబుతున్నా. ట్రేడర్స్ ఎవరూ ఆందోళన చెందవద్దు. మీ భద్రత కోసం మేం ఒక కొత్త వ్యవస్థనే రూపొందిస్తాం అన్నారు.