పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్
న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ( Aravind Kejriwal ) దూసుకుపోతున్నారు. గత మూడు రోజులుగా ఆయన పంజాబ్లోని వివిధ నియోజకవర్గాల్లో తన అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ అమృత్సర్లో ప్రచారం చేస్తున్న ఆయన.. పంజాబ్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూపైన, శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి బిక్రమ్ సింగ్ మజీతియాపై విమర్శలు గుప్పించారు.
నవజోత్ సింగ్ సిద్ధూ, బిక్రమ్ సింగ్ మజీతియా ఇద్దరినీ ఏనుగులతో పోల్చారు. వాళ్లిద్దరూ రాజకీయ ఏనుగులని వ్యాఖ్యానించారు. సిద్ధూ, మజీతియా ఇద్దరూ రాజకీయ ఏనుగులు అని, వాళ్లకు ప్రజాసమస్యలు పట్టవని, ప్రజల ఆకాంక్షలను తొక్కేస్తారని కేజ్రివాల్ విమర్శించారు. ఇక్కడ ప్రజాసమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేసే జీవన్ జాట్ మాత్రమే విజయం సాధించబోతున్నారని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినా అవినీతి రాజ్యమేలుతున్నదని అన్నారు. ఆనాడు స్వాతంత్య్ర పోరాటంలో త్యాగాలు చేసిన వారికి గుర్తింపే లేకుండా పోయిందని చెప్పారు. దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన కుటుంబాలను చిన్నచూపు చూడొద్దని హితవు పలికారు. భగత్సింగ్, బీఆర్ అంబేద్కర్ లాంటి మహానీయులను ఆరాధించే మనం అక్రమార్కులకు సహకరించవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.