న్యూఢిల్లీ, అక్టోబర్ 3: కారుణ్య నియామకం హక్కు కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అనుకోకుండా ఎదురైన ప్రతికూల సందర్భం నుంచి బాధిత కుటుంబానికి ఉపశమనం కలిగించడమే కారుణ్య నియామకం ఉద్దేశమని తెలిపింది. ఈ మేరకు సింగిల్ జడ్జి ఆదేశాలను సమర్థిస్తూ కేరళ హైకోర్టు ధ్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణమురళీతో కూడిన ధర్మాసనం గతవారం పక్కనపెట్టింది. కారుణ్య నియామకం ఇవ్వాలని ఓ మహిళ పెట్టుకున్న దరఖాస్తును పరిగణించాలని కేరళ హైకోర్టు న్యాయమూర్తి ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ను ఆదేశించారు. కేసు వేసిన మహిళ తండ్రి సదరు కంపెనీలో పనిచేశారు. 1995లో డ్యూటీలో ఉండగా ఆయన మృతిచెందారు. మరణించిన సమయంలో ఆయన భార్య కూడా ఉద్యోగం చేస్తున్నారని, కాబట్టి కారుణ్య ప్రాతిపదిక నియామక అర్హత లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా పేర్కొన్నది. మరణించిన ఉద్యోగిపై ఆధారపడిన వ్యక్తికి కారుణ్య నియామకం ఇవ్వడం అనేది ఉద్యోగాల నియామకాల విషయంలో పేర్కొన్న నిబంధనలకు మినహాయింపు అని తీర్పులో తెలిపింది. కారుణ్య నియామకం ఒక మినహాయింపు మాత్రమేనని, హక్కు కాదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.