VFS Global | న్యూఢిల్లీ: నకిలీ అడ్మిషన్ లెటర్లు, ఫేక్ డాక్యుమెంట్లతో కెనడాకు వెళ్లిన వందలాది మంది భారత విద్యార్థులు అక్కడ బహిష్కరణకు గురైన నేపథ్యంలో వీసా ఏజెంట్లు, ఆపరేటర్ల మోసాల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. భారీ మొత్తంలో డబ్బు తీసుకొని నకిలీ డాక్యుమెంట్లు, వీసా పత్రాలు ఇస్తున్న ఘటనలు వెలుగు చూస్తుండటంపై నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. విదేశాల్లో ఉన్నత చదువుకు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో కీలక సూచనలు చేస్తున్నారు. ఏజెంట్ల మోసాల ఉచ్చులో పడకుండా ఉండేందుకు వీలైనంత త్వరగా తాము వెళ్లాలనుకొంటున్న దేశాల వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. థర్డ్ పార్టీ సంస్థలను ఆశ్రయించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని వీసా ఔట్సోర్సింగ్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీ ‘వీఎఫ్ఎస్ గ్లోబల్’ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఏజెంట్లపై ఆధారపడకుండా.. తాము చదవాలనుకునే విద్యాసంస్థ గురించి సమగ్ర వివరాలు తెలుసుకోవాల్సిన బాధ్యత విద్యార్థుల పైనే ఉన్నదని అన్నారు.
డిమాండ్ను ఆసరాగా చేసుకొని..
చాలా దేశాలు తమ విద్యాసంస్థల్లో భారత విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశం కల్పిస్తున్నాయి. భారత విద్యార్థులు ఎక్కువగా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకేకు వెళ్తుంటారు. విదేశీ విద్య కలను నెరవేర్చుకొనే క్రమంలో కొంతమంది మోసపూరిత ఏజెంట్ల ఉచ్చులో పడుతున్నారు. మే నుంచి సెప్టెంబర్ వరకు స్టూడెంట్ సీజన్లో వీసాల కోసం డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది మోసాలకు పాల్పడుతుంటారని వీఎఫ్ఎస్ గ్లోబల్ అధికార ప్రతినిధి హెచ్చరించారు. రూ.50 వేలు తీసుకొని ఢిల్లీకి చెందిన ఏజెంట్లు ఇచ్చిన నకిలీ డాక్యుమెంట్లతో ఇటలీ వీసా కోసం దరఖాస్తు చేసుకొనేందుకు వచ్చిన ఏడుగురిని వీఎఫ్ఎస్ గ్లోబల్ ఇటీవల పట్టుకొన్నది.