లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ సారి ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీల మధ్య పోటీ నెలకొంది. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ, అధికారాన్ని హస్తగతం చేజిక్కించుకోవాలని సమాజ్వాది పార్టీ కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో అఖిలేశ్ నేతృత్వంలోని పార్టీకి ఎదురుదెబ్బ తగలనున్నది. ములాయం సింగ్ కోడలు అపర్ణ యాదవ్ బీజేపీలోకి చేరనున్నారు.
అపర్ణ మాజీ సీఎం ములాయం చిన్న కొడుకు ప్రతీక్ భార్య. ఇవాళ ఉదయం యోగి ఆదిథ్యనాథ్ సమక్షంలో అపర్ణ బీజేపీలో చేరుతారని హర్యానా బీజేపీ ఇన్చార్జి అరుణ్ యాదవ్ ట్వీట్ చేశారు. బీజేపీలో చేరిన అనంతరం బీజేపీ చీఫ్ నడ్డాతో అపర్ణ సమావేశం కానున్నారు. అయితే, అపర్ణ లక్నో కాంట్ అసెంబ్లీ శాసనసభా స్థానం టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. 2017లో అపర్ణ అదే స్థానం నుంచి పోటీ చేసి.. బీజేపీకి చెందిన రీటా బహుగుణ జోషి చేతిలో ఓటమిపాలయ్యారు.
ఎన్నికల్లో అపర్ణకు 63వేలకుపైగా ఓట్లు పోలయ్యాయయి. అపర్ణ బీజేపీలో చేరితే.. యూపీలో అధికారంలోకి రావాలని చూస్తున్న అఖిల్ యాదవ్కు ఈ పరిణామం పెద్ద ఎదురుదెబ్బలాంటిదే. ఓ సంస్థను నడుపుతున్న అపర్ణ బీజేపీ కార్యక్రమాలను ప్రశంసిస్తూ.. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి రూ.11లక్షలు విరాళంగా ఇవ్వడం గమనార్హం. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో ఏడు విడుతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడత ఎన్నికలు ఫిబ్రవరి 10న జరుగనుండగా.. మార్చి 7న చివరి దశ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది.