ఢిల్లీ : ములుగు జిల్లాలో ఉన్న రామప్ప దేవాలయాన్ని యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ స్థలంగా గుర్తించాడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద సింగ్ పటేల్ని రాష్ట్ర ప్రతినిధుల బృందం కోరింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆద్వర్యంలో మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, యువజన సర్వీసులు, సాంస్కృతికశాఖ కార్యదర్శి శ్రీనివాస్ రాజు, కాకతీయ హెరిటేజ్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎమ్. పాండు రంగారావు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈడీ శంకర్ రెడ్డి సభ్యులుగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రాతినిధ్యం బృందం బుధవారం కేంద్ర పర్యాటక శాఖామంత్రి ప్రహ్లాద్ను ఢిల్లీలో కలిసి వినతి పత్రం అందజేశారు.
ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన రామప్ప దేవాలయాన్ని యూనెస్కో ద్వారా వరల్డ్ హెరిటేజ్ కేంద్రంగా ప్రకటించడానికి కేంద్ర టూరిజంశాఖ సహాయ మంత్రి ప్రహాల్ద్ సింగ్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున మెమోరాండం సమర్పించారు. రామప్ప దేవాలయాన్ని యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ స్థలంగా గుర్తించాడానికి కావాల్సిన ప్రక్రియ దాదాపుగా పూర్తి కావాల్సి వచ్చిందని, ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి రామప్ప దేవాలయాన్ని యూనెస్కో ద్వారా వరల్డ్ హెరిటేజ్ స్థలంగా ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వం కృషిచేయాలని మెమోరాండం సమర్పించారు.