లక్నో: ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహంతోపాటు మరో రెండు విగ్రహాలు (Ram Lalla Idol) కూడా కొలువుదీరనున్నాయి. కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన నల్ల గ్రానైట్ రామ్ లల్లా విగ్రహాన్ని సోమవారం గర్భ గుడిలో ప్రతిష్టించారు. అలాగే ఇప్పటి వరకు టెంట్లో పూజలందుకున్న అసలైన రాముడి చిన్న విగ్రహాన్ని కూడా గర్భగుడిలో ఉంచారు.
కాగా, రామ మందిరంలోని గర్భ గుడిలో ప్రతిష్టాపన కోసం మరో రెండు రామ్ లల్లా విగ్రహాలు కూడా పోటీపడ్డాయి. మరో నల్లరాతి బాల రాముడి విగ్రహాన్ని శిల్పి గణేష్ భట్ చెక్కారు. కర్నాటకలోని మైసూర్లో హెగడదేవనా కోటే ప్రాంతంలోని వ్యవసాయ భూమిలో దొరికిన నల్ల రాయితో ఈ విగ్రహాన్ని రూపొందించారు. కృష్ణ శిలా అని పిలిచే నల్లని రాతితో చెక్కిన ఈ రామ్ లల్లా విగ్రహం కూడా ఎంతో ఆకట్టుకుంటున్నది.
మరోవైపు రాజస్థాన్కు చెందిన సత్యనారాయణ పాండే తెల్లటి పాలరాతితో మరో రాముడి విగ్రహాన్ని చెక్కారు. పాలరాతి నగలు, దుస్తులు ధరించిన రామ్ లల్లా కూడా విల్లు, బాణాన్ని కలిగి ఉన్నాడు. అలాగే విష్ణువు అవతారాలను సూచించే చిన్న శిల్పాలతో ఈ విగ్రహం కూడి ఉంది. గర్భగుడిలో కొలువుతీరని ఈ రెండు రాముడి విగ్రహాలను రామ మందిరంలోని మొదటి, రెండో అంతస్తులో ప్రతిష్టాపన చేస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు.