చెన్నై: తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్కు మరో షాక్ ఎదురైంది. ఆయన నేతృత్వంలోని డీఎంకేతో 9 ఏళ్లుగా కలిసి ఉన్న ఎండీఎంకే ఆ కూటమి నుంచి వైదొలగింది. పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నది. (MDMK Quits DMK Alliance) ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రభుత్వాన్ని స్వాగతించడంతో పాటు ఎన్నికల హామీల విషయంలో రాజీపడకుండా వ్యవహరించాలని ఒక తీర్మానంలో కోరింది. అవినీతి రహిత పాలన అందించాలని, మెకెదాటు డ్యామ్ ప్రాజెక్ట్ వంటి అంశాలపై తమిళనాడు హక్కులను పరిరక్షించడం వంటి వాటిపై ప్రభుత్వం దృఢంగా ఉండాలని సూచించింది. అయితే అధికార టీవీకే కూటమి వైపు ఎండీఎంకే మొగ్గుచూపుతున్నప్పటికీ అందులో చేరడం గురించి ఆమోదించిన తీర్మానాల్లో స్పష్టంగా ప్రస్తావించలేదు.
కాగా, డీఎంకే కూటమి నుంచి వైదొలగడాన్ని ఎండీఎంకే సమర్థించుకున్నది. తమ పార్టీని బలహీనపరిచే ప్రయత్నాలు జరిగాయని విమర్శించింది. అలాగే తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి డీఎంకే వద్ద ఒక రహస్య ప్రణాళిక ఉన్నట్లు ఆరోపించింది. ఈ పరిస్థితుల వల్ల డీఎంకే కూటమిలో కొనసాగడం అసాధ్యమని పేర్కొంది.
అయితే ఎండీఎంకే ఆరోపణలను డీఎంకే ఖండించింది. అసెంబ్లీ, పార్లమెంటులో ఎండీఎంకే ప్రాతినిధ్యం పొందేలా చేసింది డీఎంకేనే అని ఆ పార్టీ నేత సయ్యద్ హఫీజుల్లా తెలిపారు. ‘వంశపారంపర్య రాజకీయాలకు వ్యతిరేకంగా వైకో సాగించిన పోరాటానికి ఇది పూర్తిగా విరుద్ధం. ఎండీఎంకేలో ఆయన కుమారుడు దురై వైకోకు ఉన్నత స్థానం కల్పించడమే ఆ పార్టీ బలహీనపడటానికి కారణం’ అని ఆయన అన్నారు.
మరోవైపు డీఎంకే కూటమి నుంచి ఎండీఎంకే వైదొలగడంపై ఆ పార్టీలో అసమ్మతి రాజుకున్నది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గుర్తుపై గెలిచిన ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తాము డీఎంకేతోనే కొనసాగుతామని సంకేతాలు ఇచ్చారు. సాధారణ కౌన్సిల్ సమావేశాన్ని వారు బహిష్కరించారు. దీంతో ఎండీఎంకే అధికారికంగా టీవీకేతో జతకట్టినప్పటికీ, అధికార పార్టీ శాసనసభా బలం పెరుగదు. అలాగే ఉప ఎన్నికలకు దారితీసే పరిస్థితి కూడా ప్రస్తుతం లేనట్లు తెలుస్తున్నది.