న్యూఢిల్లీ: యూపీలోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో క్షుణ్ణంగా సర్వే చేయించాలని కోరుతూ ఓ పిటిషన్ సోమవారం దాఖలైంది. ‘శివలింగం’, వజుఖానా (కాళ్లు, చేతులు కడుగుకొనే ప్రదేశం) 2022 మే నుంచి సీలు వేసి ఉన్నాయని, వీటిని కూడా సర్వే చేయాలని పురాతత్వ అధ్యయనాల సంస్థ (ఏఎస్ఐ)ని ఆదేశించాలని ఈ కేసులోని హిందూ పక్షం కోరింది. సీలు వేసిన ప్రాంతంలో మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ ఏఎస్ఐ సర్వే చేసిందని తెలిపింది. పిటిషనర్లకు, హిందువులకు శివ లింగాన్ని దర్శించుకుని, పూజలు చేసే హక్కు ఉందని పేర్కొన్నది. ఇక్కడ ఉన్నది శివలింగమా? ఫౌంటెనా? అనేది నిర్ధారణ కావాలంటే, సీలు చేసిన స్థలంలో పూర్తిగా శాస్త్రీయ సర్వే జరగాలని తెలిపింది. అయితే ముస్లిం పక్షం వాదన ప్రకారం, 2022 మే నెలలో కనిపించినది శివలింగం కాదు, కేవలం ఫౌంటెన్ మాత్రమే. మసీదు కింద ఆలయం ఉండేదని ఏఎస్ఐ సర్వేలో తేలిన విషయం తెలిసిందే.