బెంగళూరు: బీజేపీ పాలిత కర్ణాటకలో మరో కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం నుంచి బిల్లులు క్లియర్ కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. మృతుడ్ని 50 ఏళ్ల టీఎన్ ప్రసాద్గా గుర్తించారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్మార్ట్సిటీ ప్రాజెక్ట్ కింద రూ.16 కోట్ల విలువైన నిర్మాణ పనులను కాంట్రాక్టర్ ప్రసాద్ చేపట్టారు. అయితే బిల్లుల బకాయిలను ప్రభుత్వం క్లియర్ చేయకపోవడంతో అప్పులపాలయ్యాడు. ఈ నేపథ్యంలో అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి వస్తుండటంతో పునర్నిర్మాణం చేస్తున్న ఇన్స్పెక్షన్ బంగ్లాలో గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదంటూ సూసైడ్ నోట్లో ఉందని చెప్పారు.
కాగా, ప్రభుత్వ కాంట్రాక్ట్ను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ ప్రసాద్ భారీగా రుణాలు పొందాడని కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు బలరాం తెలిపారు. ఆ అప్పు తీర్చేందుకు ఐదు నెలల కిందట తన ఇంటిని కూడా అమ్మేశాడని చెప్పారు. బిల్లుల క్లియరెన్స్లో ఆలస్యం వల్ల నిస్పృహకు లోనయ్యాడని, దీని గురించి బుధవారం తనతో మాట్లాడినట్లు తోటి కాంట్రాక్టర్, ఆయన స్నేహితుడు రాజేంద్ర తెలిపారు.
మరోవైపు, సీఎం బొమ్మై ప్రభుత్వంలోని అవినీతిపై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. 40 శాతం కమీషన్ ఇవ్వకపోతే బిల్లులు పాస్ కావంటూ కొందరు కాంట్రాక్టర్లతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. ‘పేసీఎం’ పేరుతో పోస్టర్ల ప్రచారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇటీవల చేపట్టింది.