న్యూఢిల్లీ, మార్చి 25: డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న హర్యానాలో మరో అవినీతి కుంభకోణం బయటపడింది. సరైన గుర్తింపు లేకుండా, సరిగ్గా వెరిఫికేషన్ చేయకుండా అనర్హులకు రూ.42 కోట్ల కిసాన్ సమ్మాన్ నిధులు కట్టబెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెల్లడించింది. నిబంధనలకు విరుద్ధంగా ఆదాయ పన్ను చెల్లింపుదారులు, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు, చనిపోయిన రైతులు, మైనర్లు, అసలు వ్యవసాయ భూమిలేని వారికి నిధులను పప్పుబెల్లంలా పంచిపెట్టారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకాన్ని 2019 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టారు. అర్హులైన పేద రైతులకు ఆర్థికంగా తోడ్పాటు అందించేలా పథకం కింద ఏటా రూ.6 వేలు మూడు దఫాలుగా అందజేస్తారు. కానీ, హర్యానాలో ఎలాంటి పరిశీలన, పర్యవేక్షణ చేయకుండా అనర్హులకు నిధులను కట్టబెట్టారు.
2021లో ఆ రాష్ట్రంలో 14 బ్లాకుల్లో 84 గ్రామాలను ఎంపిక చేసి ఆడిట్ చేపట్టగా ఈ విషయం బయటపడింది. 2021 జూన్ ఒకటి నాటికి 3,131 మంది అనర్హులు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున 16,802 వాయిదాల్లో రూ.3.36 కోట్లు పొందినట్టు కాగ్ గుర్తించింది. 51 మంది మాత్రమే 207 వాయిదాల్లో అంటే రూ.4.17 లక్షలు తిరిగి చెల్లించినట్టు కాగ్ తెలిపింది. 38,109 మంది ఆదాయం పన్ను చెల్లింపుదారులు ఒక్కొక్కరు రూ.2,000 చొప్పున 1,86,677 వాయిదాల్లో రూ. 37.34 కోట్లు పొందినట్టు కాగ్ గుర్తించింది.
నలుగురు మాత్రమే 23 వాయిదాలు అంటే రూ.46 వేలు తిరిగి చెల్లించినట్టు పేర్కొన్నది. ఇప్పటివరకు అనర్హులు, ఆదాయ పన్ను చెల్లింపుదారులకు రూ.40.70 కోట్లు విడుదలయ్యాయి. అందులో రూ.4.60 లక్షలను మాత్రమే రికవరీ చేశారు. ఇంకా రూ.40.65 కోట్లు రికవరీ చేయాల్సి ఉన్నట్టు కాగ్ వెల్లడించింది. నిబంధనలకు విరుద్ధంగా 39 మంది తమ భార్యలు, మైనర్ల పేరుతో రూ.4.48 లక్షలు పొందారు. 66 మంది మృతుల పేర్లతో, 39 మంది అసలు భూమి లేకపోయినా నిధులు కాజేశారు.
పన్ను చెల్లింపుదారులు – రూ.37.34 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు – రూ.1.31 కోట్లు
మిగతా అనర్హులు – రూ. 3.36 కోట్లు