Geeta Press | గోరఖ్పూర్లోని గీతా ప్రెస్కు కేంద్రం గాంధీశాంతి పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని జ్యూరీ ఏకగ్రీవంగా పురస్కారానికి గీతా ప్రెస్ను ఎంపిక చేసింది. అయితే, పురస్కారంతో పాటు రూ.కోటి పారితోషకాన్ని తీసుకునేందుకు గీతా ప్రెస్ ట్రస్ట్ నిరాకరించింది. గీతా ప్రెస్ ఎలాంటి డొనేషన్ తీసుకోదని గీతా ప్రెస్ ట్రస్టీలు పేర్కొంటున్నారు. గీతా ప్రెస్ గాంధీ శాంతి బహుమతితో పాటుగా అందజేసే రూ.కోటి మొత్తాన్ని అంగీకరించబోమని ట్రస్ట్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సందర్భంగా ప్రెస్ మేనేజర్ డాక్టర్ లాల్ మణి తివారీ మాట్లాడుతూ గీతా ప్రెస్ ఎక్కడి నుంచి సన్మానం, డబ్బును స్వీకరించదని.. గాంధీ శాంతి బహుమతిని స్వీకరించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. పురస్కారంతో వచ్చే రూ.కోటిని మాత్రం స్వీకరించబోమని స్పష్టం చేశారు.
అయితే, ప్రపంచవ్యాప్తంగా మతపరమైన పుస్తకాలను ప్రచురించడంలో గీతా ప్రెస్ ప్రసిద్ధి చెందింది. గీతా ప్రెస్కి 2021 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతి రావడంపై ట్రస్టీ నుంచి గోరఖ్పూర్ నగర వాసులు సైతం సంతోషం వ్యక్తం చేశారు. ట్రస్టు ప్రారంభించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో పురస్కారానికి ఎంపిక చేశారు. సనాతన ధర్మం, సంస్కృతి పునరుజ్జీవనంలో గీతా ప్రెస్ చేసిన కృషి సాటిలేదని, గీతాప్రెస్ ఒక ప్రెస్ మాత్రమే కాదని.. పుణ్యక్షేత్రం వంటిదని తివారీ తెలిపారు. 1923 ఏప్రిల్ 29న ప్రారంభించగా.. క్రమక్రమంగా విస్తరించింది. ప్రెస్కు రెండు లక్షల చదరపు అడుగుల స్థలం ఉంది. 1.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రెస్, ఆఫీసు, మెషిన్లు ఉన్నాయి. 55వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దుకాణాలు, నివాసాలు ఉన్నాయి.
గీతా ప్రెస్ నుంచి శ్రీమద్ భగవత్ గీత, రామచరిత్ మానస్, పురాణాలు, ఉపనిషత్తులతో సహా 15 భాషల్లో పుస్తకాలు ప్రచురిస్తున్నట్లు ప్రెస్ మేనేజర్ తెలిపారు. హిందీ, సంస్కృతం, బంగ్లా, మరాఠీ, గుజరాతీ, తమిళం, కన్నడ, అస్సామీ, ఒరియా, ఉర్దూ, తెలుగు, మలయాళం, పంజాబీ, ఇంగ్లిష్, నేపాలీ తదితర భాషల్లో ముద్రిస్తున్నది. గీతా ప్రెస్ నుంచి ఇప్పటివరకు దాదాపు 1,850 రకాల పుస్తకాలు.. 92.5 కోట్లకుపైగా ప్రచురితమయ్యాయి. అయితే, మహాత్మా గాంధీకి గీతా ప్రెస్తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన కళ్యాణ్ పత్రికకు తొలి వ్యాసం రాశారు. సంక్షేమంపై అనేక వ్యాసాలు, సందేశాలను ఇచ్చారు. గాంధీజీ మరణానంతరం గీతా ప్రెస్ వివిధ విషయాలపై గాంధీజీ అభిప్రాయాలను సైతం ప్రచరిస్తూ వస్తున్నది. మహాత్మా గాంధీ అక్టోబర్ 8, 1933న గీతా ప్రెస్ గీత ప్రవేశికకు ముందుమాట రాశారు. గాంధీజీ వార్ధాలోని సత్యాగ్రహ సమయంలో రాసిన మూడు పేజీల లేఖ ఇప్పటికీ గీత ప్రెస్లోని లీలా చిత్ర మందిరంలో భద్రపరిచారు.