చండీగఢ్, ఆగస్టు 28: ‘ఉచిత పథకాలు దేశ అభివృద్ధికి, స్వావలంబనకు అడ్డంకిగా మారాయి’ ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇవి. పేదలు, బడుగు బలహీనవర్గాల సంక్షేమం, అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఇదే సమయంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు, ఆయన పార్టీ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో సీఎంలు చేస్తున్న ప్రకటనలకు పొంతన ఉండటం లేదు. 60 ఏండ్లు దాటిన మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అదిత్యనాథ్ ఇటీవల ప్రకటించారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ వినియోగదారులకు 125 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తామంటూ ఆదివారం ఓ పథకాన్ని ప్రారంభించారు. మూడు నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఠాకూర్ ఈ ‘ఉచిత’ ప్రకటన చేయడం గమనార్హం.