ముంబై : సామాజిక కార్యకర్త అన్నా హజారే (Anna Hazare) మహారాష్ట్ర సర్కారుకు వ్యతిరేకంగా ఈ నెల 14 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగనున్నారు. ప్రభుత్వం సూపర్ మార్కెట్లు, స్టోర్లలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ఈ మేరకు నిరాహార దీక్షకు దిగనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని ఉపసంహరించుకోవాలని అన్నా హజారే బుధవారం సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు మరోసారి లేఖ రాశారు. మద్యం పాలసీపై పునరాలోచించాలని లేఖలో కోరానని, దానిపై స్పందించకుంటే ఈ నెల 14 నుంచి నిరాహార దీక్ష చేస్తానని పేర్కొన్నారు.
ఈ విషయమై ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్కు కూడా లేఖ రాశానని, ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని పేర్కొన్నారు. ఇంతకు ముందు ఈ నెల 3న సీఎంకు లేఖ రాశానని.. ఇప్పటి వరకు స్పందన రాలేదని అన్నా హజారే తెలిపారు. మళ్లీ గుర్తు చేసేందుకు రిమైండర్ లేఖ రాశామన్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రజలను మద్యానికి బానిస చేస్తుందన్న అన్నా హజారే.. డీ అడిక్షన్ కోసం పని చేయడం ప్రభుత్వం బాధ్యతన్నారు. అయితే, ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోవడం బాధ కలిగించిందన్నారు.