న్యూఢిల్లీ: మొబైల్ యాప్ (mobile app) డోన్లోడ్ ఆలస్యంపై ఒక వ్యక్తి ఆగ్రహం చెందాడు. భార్యతో గొడవకు దిగాడు. జోక్యం చేసుకున్న కుమారుడ్ని కత్తితో పొడిచాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. 64 ఏళ్ల అశోక్ సింగ్ ఒక సంస్థలో సీనియర్ మేనేజర్గా పని చేసి రిటైర్డ్ అయ్యాడు. భార్య, కుమారుడితో కలిసి ఢిల్లీలోని మధు విహార్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అశోక్ సింగ్ ఇటీవల గురుగ్రామ్లో ఒక ఫ్లాట్ కొన్నాడు. డబ్బులు చెల్లింపు కోసం ఒక యాప్ను భార్య మంజు సింగ్ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేయాలని ఆమెకు చెప్పాడు.
కాగా, భార్య మొబైల్ ఫోన్లో ఆ యాప్ త్వరగా డౌన్లోడ్ కాలేదు. డౌన్లోడ్కు చాలా సమయం తీసుకోవడంతో భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. తల్లిదండ్రుల మధ్య ఘర్షణ చూసిన కుమారుడైన 23 ఏళ్ల ఆదిత్య జోక్యం చేసుకున్నాడు. అయితే కోపాన్ని తట్టుకోలేకపోయిన అశోక్ సింగ్ వంట గదిలోని కత్తితో కుమారుడి ఛాతిపై పొడిచాడు. అదృష్టవశాత్తు ఆదిత్య పక్కటెముకలపైన గాయమైంది. వెంటనే లాల్ బహుదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించారు. చికిత్స తర్వాత అతడ్ని డిశ్చార్జ్ చేశారు.
మరోవైపు ఆసుపత్రి సిబ్బంది నుంచి ఈ సమాచారం పోలీసులకు తెలిసింది. దీంతో కుమారుడ్ని కత్తితో పొడిచిన తండ్రి అశోక్ సింగ్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. కంప్యూటర్ ఇంజినీర్ అయిన ఆదిత్య, గురుగ్రామ్లోని ఒక సంస్థలో పని చేస్తున్నట్లు చెప్పారు.