న్యూఢిల్లీ, నవంబర్ 2: గవర్నర్ల తీరుపై ప్రతిపక్ష పాలిత రాష్ర్టాలు న్యాయపోరాటానికి దిగుతున్నాయి. బిల్లులను ఆమోదించకుండా అంతులేని జాప్యం చేస్తూ, ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి నిత్యం అడ్డంకులు సృష్టిస్తున్న గవర్నర్లకు ముకుతాడు వేయాలని సుప్రీంకోర్టు తలుపు తడుతున్నాయి. గవర్నర్ తమిళిసై తీరుపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా.. తాజాగా తమిళనాడు, పంజాబ్, కేరళ కూడా తెలంగాణ బాటలోనే నడుస్తున్నాయి.
రాజకీయ ప్రత్యర్థిలా గవర్నర్
గవర్నర్ ఆర్ఎన్ రవి రాజకీయ ప్రత్యర్థిలా వ్యవహరిస్తున్నారని, బిల్లులను ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని తమిళనాడు ప్రభుత్వం గత మంగళవారమే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బిల్లులు, నియామక ఉత్తర్వులు, రోజువారీ ఫైళ్లపై సంతకం చేయకుండా గవర్నర్ ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆరోపించింది. నిర్దేశిత గడువులోగా బిల్లులను ఆమోదించేలా గవర్నర్ను ఆదేశించాలని అభ్యర్థించింది. పంజాబ్ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్పై ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బిల్లులకు ఆమోదం తెలుపకపోవడంపై కోర్టును ఆశ్రయించింది.
కేరళ ప్రభుత్వం కూడా..
కేరళ ప్రభుత్వం కూడా రాష్ట్ర గవర్నర్ మహమ్మద్ ఆరిఫ్ ఖాన్పై గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రజా ప్రయోజనాలు, సంక్షేమం ఇమిడి ఉన్న ఎనిమిది బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకుండా పెండింగ్లో పెట్టారని కోర్టుకు తెలిపింది. ఇందులో మూడు బిల్లులను రెండేండ్లకు పైగా, మూడు బిల్లులను ఏడాదికిపైగా పెండింగ్లో ఉంచారని వివరించింది. ‘బిల్లుల ఆమోదం, ఇతర విషయాల్లో తనకు సంపూర్ణ విచక్షణాధికారం ఇచ్చారని గవర్నర్ అనుకుంటున్నారు. ఆయనకు నచ్చినప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది రాజ్యాంగాన్ని అణచివేయడమే’ అని కేరళ ప్రభుత్వం పేర్కొంది.