Andaman Cellular Jail | ఇక్కడ జైలు జీవితం అత్యంత అమానవీయంగా, క్రూరంగా ఉండేది. అర్ధాకలితో మాడ్చేవారు. కఠినమైన శారీరక శ్రమ చేయించేవారు. తీవ్రంగా అవమానించి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేవారు.
బ్రిటిష్ పాలనలో కర్కశత్వానికి ప్రతీకగా నిలిచే కట్టడాలలో ప్రధానమైంది, ప్రముఖమైంది అండమాన్ సెల్యులార్ జైలు. ఆ జైలు ఓ బలిపీఠం. భారత్, బర్మా దేశాల్లో తీవ్రమైన నేరాలకు శిక్షపడిన ఖైదీల కోసం బెన్కోలెన్ (1787లో మొదటిది), మలక్కా, సింగపూర్, అరకాన్, టెనాస్సెరిమ్లో శిక్షా శిబిరాలు ఏర్పాటుచేసింది బ్రిటిష్ ప్రభుత్వం. వీటిలో చివరిదే అండమాన్. భారత గడ్డపైన మాత్రం ఇదే మొదటిది.
1857 సిపాయీల తిరుగుబాటు తర్వాత విప్లవకారుల ద్వీపాంతర జైలుశిక్షకు అండమాన్ను ఎంచుకున్నారు. అలా, తొలి విడతగా.. 1858 మార్చి 10న రాజకీయ ద్రోహులుగా 200 మంది దక్షిణ అండమాన్లోని పోర్ట్ బ్లెయిర్కు చేరుకున్నారు. అప్పటినుంచి స్వతంత్రం వచ్చేవరకు కొన్ని వేలమంది స్వాతంత్య్ర సమరయోధులు దుర్భరమైన జీవితం అనుభవించారు అక్కడ.ఉద్యమ ఖైదీలు బ్రిటిష్వారికి వ్యతిరేకంగా విప్లవభావాలు వ్యాప్తిచేస్తారేమో అనే సందేహంతో అండమాన్ సెల్యులార్ జైలు నిర్మాణంలో సకల జాగ్రత్తలూ తీసుకున్నారు.
దూరందూరంగా 693 గదులతో (సెల్స్తో) సెల్యులార్ జైలు 1906లో అందుబాటులోకి వచ్చింది. అలీపూర్ బాంబ్ కేసు, నాసిక్ కుట్ర కేసు, లాహోర్ కుట్ర కేసు, బనారస్ కుట్ర కేసు, చిట్టగాంగ్ ఆయుధాగారంపై దాడి కేసు, ఢాకా కుట్ర కేసు వగైరా కేసులు, మలబారుకు చెందిన మోప్లా ఆందోళనకారులు, ఆంధ్ర నుంచి రంప విప్లవకారులు, మణిపూర్ స్వాతంత్య్ర సమరయోధులను అండమాన్లోనే ఉంచారు. ఇక్కడ జైలు జీవితం అత్యంత అమానవీయంగా, క్రూరంగా ఉండేది. ఖైదీలను అర్ధాకలితో మాడ్చేవారు. కఠినమైన శారీరక శ్రమ చేయించేవారు. తీవ్రంగా అవమానించి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేవారు. ఆ త్యాగాలకు గుర్తుగా సెల్యులార్ జైలును 1979లో జాతీయ స్మారకంగా ప్రకటించింది మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం.