శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా కొకెర్నాగ్ ఏరియాలో గత నాలుగు రోజులుగా భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు నడుమ భీకరపోరు కొనసాగుతున్నది. గారోల్ ఫారెస్ట్లోని కొకెర్నాగ్ ఏరియా అంతా తుపాకుల మోతతో దద్ధరిల్లుతున్నది. అడవిలో దాగి దొంగచాటుగా నలుగురు అధికారుల ప్రాణం తీసిన ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఇండియన్ ఆర్మీ దాడులను మరింత తీవ్రతరం చేసింది.
డ్రోన్లతో బాంబుల వర్షం కురిపిస్తున్నది. ఈ క్రమంలో శనివారం ఉదయం గారోల్ ఫారెస్టులో ఉగ్రవాద స్థావరంపై భారత సైన్యం బాంబు దాడి చేసింది. బాంబు పేలగానే ఉగ్రవాదులు తమ స్థావరం నుంచి పారిపోతున్న దృశ్యాలు డ్రోన్లకు అమర్చి ఉన్న కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కింది వీడియోలో ఆ దృశ్యాలను మీరు కూడా వీక్షించవచ్చు.