Anant Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ (Anant Ambani) తన గొప్ప మనసు చాటుకున్నారు. తాము తమ దేశంలోని 80 హిప్పోపొటమస్ (Hippopotamuses) లను చంపాలనుకుంటున్నామని కొలంబియా ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఆయన స్పందించారు. ఆ హిప్పోలను చంపవద్దని, వాటికి వంతారా (Vantara) జంతు సంరక్షణ కేంద్రంలో శాశ్వత నివాసం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు కొలంబియా పర్యావరణ, సుస్థిర అభివృద్ధి శాఖకు అభ్యర్థన పంపారు. ప్రాణం ఉన్న జీవులుగా వాటికి జీవించే హక్కు ఉందని, వాటికి కావాల్సిన అన్ని సదుపాయాలు, సురక్షితమైన పరిస్థితులను తాము కల్పిస్తామని తెలిపారు.
కాగా కొలంబియాలోని మగ్దలీనా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న నీటి ఏనుగుల వల్ల అక్కడి జీవవైవిధ్యానికి, పర్యావరణ వ్యవస్థకు హాని కలుగుతుండటంతో వాటిని చంపేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించుకుంది. వాటివల్ల ప్రజలకు కూడా ప్రమాదం పొంచి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ హిప్పోలు దక్షిణ అమెరికాకు చెందినవి కావు. వీటిని అప్పట్లో డ్రగ్ వ్యాపారి ఎస్కోబార్ ఆఫ్రికా నుంచి తీసుకువచ్చి తన సొంత జూలో ఉంచాడు. అనంతరం ఎస్కోబార్ను అరెస్టుచేయడంతో అతని అధ్యాయం ముగిసింది.
హిప్పోల సంరక్షణ పట్టించుకోకపోవడంతో నదీ పరివాహకప్రాంతంలో ఉంటున్నాయి. వీటి సంతతి బాగా పెరగడంతో ఆహారం కోసం జనావాస ప్రాంతాలకు చొరబడుతున్నాయి. ప్రజలపై దాడులు చేయడం, చేపలు, తాబేళ్లను తినడం చేస్తున్నాయి. దాంతో వాటి జనాభాను నియంత్రించాలని కొలంబియా సర్కారు నిర్ణయం తీసుకుంది. అందులోభాగంగా 80 హిప్పోలను చంపివేయాలని ప్రభుత్వ అధికారులు ప్రతిపాదించారు.
కాగా, రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనంత్ అంబానీ నిర్వహిస్తున్న అతిపెద్ద వన్యప్రాణుల పునరావాస కేంద్రం వంతారా. ఈ అభయారణ్యం గుజరాత్లోని జామ్నగర్లో కొన్ని వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో రెండు వేలకు పైగా జంతువులు ఉన్నాయి. వేటగాళ్ల బారిన పడి గాయపడిన లేదా నిరాదరణకు గురైన జంతువులను వంతారా బృందం రక్షించి వాటికి ప్రత్యేక వైద్య సంరక్షణ, పునరావాస సదుపాయాలు కల్పిస్తూ ఉంటుంది.