‘జై బజరంగ బలి’ నినాదంతో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలనుకొంటున్నారు. వివాదాస్పద ‘ది కేరళ స్టోరీ’ సినిమాను ప్రమోట్ చేస్తూ కేరళలో మత చిచ్చు రాజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ సినిమాపై మాట్లాడేందుకు దొరికిన సమయం.. మణిపూర్ హింసాకాండపై నోరు మెదపడానికి ప్రధానికి దొరక లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
– స్పెషల్ టాస్క్ బ్యూరో
BJP | హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఆందోళనలతో అట్టుడికిపోతున్నది. మైతీ తెగకు ఎస్టీ హోదా ఇవ్వొద్దంటూ ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ చేపట్టిన నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. రెండు వర్గాల మధ్య జరిగిన అల్లర్లుగా పైకి కనిపిస్తున్నప్పటికీ, ఈ హింసాకాండ వెనుక.. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విభజన వాదమే కారణమన్న వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసమే కమలదళం మత చిచ్చు రాజేసినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మణిపూర్ జనాభాలో 53 శాతం మంది ఉన్న మైతీలు ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీన్ని గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. బుధవారం జరిగిన గిరిజన కవాతులో కొందరు సాయుధులు (సంఘ్ పరివార్ శక్తులు అని అనుమానం) రెచ్చిపోయారు. మైతీ తెగ వారిపై ఉద్దేశపూర్వకంగా దాడులకు తెగబడ్డారు. దీంతో ఇరు వర్గాలు పరస్పరం ఘర్షణలకు దిగాయి. పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఈ ఘర్షణలకు బీజేపీ మతోన్మాద రాజకీయాలే కారణంగా తెలుస్తున్నది. రాష్ట్రంలో 40 శాతం జనాభా ఉన్న కుకీ, నాగా తెగ ప్రజల కన్నా మైతీల ఓటు బ్యాంకునే బీజేపీ కీలకంగా భావిస్తున్నది. అందుకే మైతీలకు ఎస్టీ హోదా ఇచ్చేందుకు యత్నించింది. ఇది గిరిజన తెగలకు, విద్యార్థులకు ఆగ్రహం తెప్పించింది. అంతేకాకుండా రక్షిత అడవుల నుంచి కుకీ, నాగా గిరిజనులను వెళ్లగొడుతున్న అక్కడి బీజేపీ ప్రభుత్వం వారికి పునరావాసాన్ని పూర్తి స్థాయిలో కల్పించడం లేదు. గిరిజనుల తరలింపు పేరిట మూడు చర్చిలను ధ్వంసం చేసిన ప్రభుత్వం.. క్రమంగా దీనికి మతం రంగు పులమాలనుకొన్నది. రాజకీయ ప్రయోజనాల కోసం మతచిచ్చు రేపిన బీజేపీ.. మణిపూర్ అల్లర్లను క్రైస్తవులు-హిందువుల మధ్య ఘర్షణగా చూపేందుకు ప్రయత్నిస్తున్నది.
అల్లర్లతో ఓవైపు మణిపూర్ అట్టుడికిపోతుంటే, ఈ విషయాన్ని పట్టించుకోని ప్రధాని మోదీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోయారు. ‘40 శాతం కమీషన్’ అవినీతి ఆరోపణలతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన బీజేపీని మళ్లీ ఎలాగైనా గెలిపించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హనుమంతుడిని కూడా రాజకీయాల్లోకి లాగారు.
లవ్జిహాద్ ఇతివృత్తంతో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రంపై వివాదాలు కొనసాగుతున్నాయి. దక్షిణాదిలో పాగాకు మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి.. మత మార్పిడిల కథనాన్ని సినిమా ద్వారా ప్రచారం చేసి బీజేపీ తన ఓటు బ్యాంక్ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నదని విపక్షాలు మండిపడుతున్నాయి. దీనికి బలాన్ని చేకూరుస్తూ.. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఈ సినిమాను ప్రచారం చేస్తున్నట్టుగా మోదీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఉగ్రవాదులు కేరళను ఎంత దారుణంగా నాశనం చేస్తున్నారో ఈ సినిమాలో కండ్లకు కట్టినట్టు చూపించారన్న మోదీ.. ఒక విధంగా ఈ సినిమాకు ప్రచారం కల్పిస్తూ కేరళలో మతచిచ్చుకు ఆజ్యం పోశారు.
హింసాత్మక ఘటనలతో మణిపూర్ కల్లోలంగా మారినప్పటికీ, అవేమీ పట్టించుకోని ప్రధాని మోదీ.. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్క ఫోన్ కాల్తో ఆపేలా చేసిన మోదీ(మోదీ పరీవారం ఊహించుకొంటున్నారు).. మణిపూర్ హింసను ఎందుకు నిలువరించలేకపోతున్నారని నెటిజన్లు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ మతచిచ్చును రాజేసిందని మండిపడుతున్నారు.
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకొన్నది. దీంతో ఆ పార్టీ నేతలు మత రాజకీయాలను ఆశ్రయిస్తున్నారు. 2019 నుంచి ఇప్పటివరకూ ట్రబుల్ ఇంజిన్ సర్కారులో నెలకొన్న అవినీతి, కమీషన్ చార్జీలకు సంబంధించిన రేట్ కార్డు ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది. సీఎం పోస్టుకు రూ.2,500 కోట్లు, మంత్రి పోస్టుకు రూ.500 కోట్లు అంటూ 19 పోస్టులకు, వివిధ కాంట్రాక్టులకు ఎంత చెల్లించాలో.. ఈ కార్డులో వివరించడం బీజేపీ నేతలకు ఇరకాటంగా మారింది.
రాజ్యాధికారంతో మత రాజకీయాలు అంటకాగినప్పుడు.. ఆ దేశం రావణకాష్టంగా మారుతుంది. సంక్షోభంలో చిక్కుకొన్న రాజ్యాన్ని రక్షించాల్సిన ప్రభువు.. అది మరిచిపోయి తన అధికారాన్ని నిలబెట్టుకోడానికి ప్రయత్నిస్తే.. ప్రజలు తిరగబడతారు.
– చరిత్ర చెప్తున్న సత్యం ఇది
రాజకీయాల్లో మతాన్ని కలుపుతూ రాజకీయ నేతలు చేస్తున్న ప్రసంగాలతోనే ఇప్పుడు సమస్యంతా. మతాన్ని, రాజకీయాలను వేరుగా చూడాలి. అప్పుడే ఘర్షణలు, విద్వేష ప్రసంగాలు ఆగుతాయి.
– మార్చి 29న సుప్రీంకోర్టు వ్యాఖ్య