న్యూఢిల్లీ: ఈ నెల 30న ప్రారంభించనున్న ‘అమృత్ భారత్’ రైలు (Amrit Bharat Train) తొలి వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేశారు. ‘అమృత్ కాల్ కి అమృత్ భారత్ ట్రైన్’ అని ఎక్స్లో పేర్కొన్నారు. వందే భారత్ తరహాలో వేగంగా ప్రయాణించే ఈ రైలులో రాత్రి వేళ పడుకునే సౌకర్యంతోపాటు అనేక ప్రత్యేకతలను ఆయన వివరించారు. లోకో పైలట్ క్యాబిన్, రైలులోని సీట్లు, టాయిలెట్లు, ఇతర సౌకర్యాల గురించి తెలిపారు. అధునాతన సాంకేతికతతో కూడిన ఈ రైలులో ప్రయాణించడం ద్వారా సుమారు రెండు గంటల సమయం ఆదా అవుతుందని చెప్పారు.
కాగా, అమృత్ భారత్ ట్రైన్ పుష్-పుల్ టెక్నాలజీ కలిగి ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రతి సీటు వద్ద మొబైల్ ఛార్జింగ్ పాయింట్, వికలాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు, తక్కువ నీరు వినియోగించే సాంకేతికత, విశాలమైన తలుపులు, ప్రత్యేక ర్యాంప్ వంటివి ఉంటాయని చెప్పారు. వందే భారత్ మాదిరిగానే, అమృత్ భారత్ రైలు కొత్త టెక్నాలజీ కలిగి ఉందన్నారు. ప్రారంభ ప్రయాణం అయోధ్య నుంచి దర్భంగా వరకు ఉంటుందని తెలిపారు. హైస్పీడ్ వందే భారత్ ట్రైన్ స్లీపర్ వెర్షన్గా పేర్కొనే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను డిసెంబర్ 30న ప్రధాని మోదీ ప్రారంభిస్తారని చెప్పారు. ఈ రైలులో సాధారణ తరగతి నుంచి సెకండ్ క్లాస్ ఏసీ వరకు బోగీలుంటాయని వివరించారు.
अमृत काल की अमृत भारत ट्रेन! pic.twitter.com/yegGEydJU5
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 26, 2023