న్యూఢిల్లీ, డిసెంబర్ 16: భావ ప్రకటనా స్వేచ్ఛపై బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి. కోల్కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ హాజరయ్యారు. ఇందులో అమితాబ్ మాట్లాడుతూ… ‘భావప్రకటన స్వేచ్ఛపై ఇంకా ప్రశ్నలు తలెత్తున్నాయి’ అని అన్నారు. ‘మమతాబెనర్జీ ఎదుట అమితాబ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆమె నిరంకుశత్వానికి అద్దం పడుతున్నాయి’ అని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలమీయ ట్వీట్ చేశారు. దీనికి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుష్రత్ జహాన్ కౌంటర్ ఇచ్చారు. ‘సినిమాలను నిషేధించడం, జర్నలిస్టులను అరెస్టు చేయడం, నిజాలు మాట్లాడిన సామాన్యులను శిక్షించడమే.. నిరంకుశత్వం’ అంటూ చురకలంటించారు. షారూఖ్ ఖాన్ తాజా చిత్రం ‘పఠాన్’పై బీజేపీ విమర్శల నేపథ్యంలో అమితాబ్ ఇలా తాజా వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.