న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్షా జమ్ముకశ్మీర్లో పర్యటించనున్నారు. శనివారం నుంచి మూడు రోజులపాటు ఈ పర్యటన కొనసాగనుంది. కశ్మీర్లో కేంద్ర మంత్రులు పర్యటించాలనే కార్యక్రమంలో భాగంగా ఆయన శనివారం ఉదయం శ్రీనగర్ వెళ్లనున్నారు. 2019 ఆగస్టు 5న జమ్ముకశ్మీర్కు ప్రత్యేక స్వయంప్రతిపత్తి కల్పించే 370 అధికరణాన్ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన తర్వాత.. అమిత్షా కశ్మీర్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో అధికారులు కశ్మీర్ లోయలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. పర్యటనలో భాగంగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఆర్పీఎఫ్ అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే సైతం ఈ పర్యటనలో పాల్గొంటున్నారు.
స్థానికేతరులు, మైనారిటీలపై ఇటీవలి దాడుల నేపథ్యంలో కశ్మీర్ లోయను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కీలక ప్రాంతాల్లో స్నిప్పర్స్, షార్ప్ షూటర్లను నియోగించారు. జమ్ముకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉగ్రవాద దాడులను నియంత్రించేందుకు శ్రీనగర్లోని సిటీ సెంటర్ నుంచి లాల్ చౌక్ వరకు గగనతలంపైనా నిఘా పెట్టాయి.