న్యూఢిల్లీ, నవంబర్ 9: మోదీకి, బీజేపీకి సీరియస్ సమస్యలు కామెడీగా కనిపిస్తున్నాయి. ఇంటింటికి మంచినీటి సరఫరా వారికి ఓ నవ్వులాట అయిపోయింది. తాజాగా అమిత్షా ట్విట్టర్లో షేర్ చేసిన వీడియో చూస్తే మాత్రం నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్థితి. అందులో మోదీ పండించిన కామెడీ ఇంతా అంతా కాదు. అంతా టామ్ అండ్ జెర్రీ షకలే. అసలే కాపీ పథకం. ఆపై డంబాచారం. కేసీఆర్ ఎప్పుడో అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఆడపడుచుల నీటిగోస చూడలేక మిషన్ భగీరథ పెట్టి ఇంటింటికీ నల్లా నీళ్లు ఇస్తున్నారు. ఇదంతా ఐదేండ్ల లోపు పూర్తి చేశారు. కాగా గుజరాత్ మంచినీటి సరఫరా ప్రాజెక్టు 2001లో ప్రారంభించి 2021లో పూర్తి చేశారు. ఆ సంగతి అలా ఉంచితే భగీరథ పథకం ప్రారంభానికి మోదీ స్వయంగా వచ్చారు.
కేసీఆర్ దీక్షాదక్షతలను కొనియాడారు. తర్వాత అనుకరణే అతిగొప్ప ప్రశంస అన్నట్టుగా కాపీకి తెగబడ్డారు. పైగా ‘మక్కీకి మక్కీ మెరె భాయ్ లిక్కీ’ అన్నట్టుగా ఈ పథకానికి నకలు తయారు చేశారు. ‘హర్ ఘర్ జల్’ అని పేరుపెట్టి కేంద్ర పథకంగా ప్రవేశపెట్టారు. గుజరాత్ ఎన్నికల్లో ఓటర్లను మాయ చేసేందుకు ఇప్పుడు ఈ పథకం గురించి, మోదీ పాత్ర గురించి ఊదరగొట్టేందుకు ఓ వీడియోను తయారు చేసి జనం మీదకు వదిలారు. అందులో మోదీ (కార్టూన్ పాత్ర) స్వయంగా పలుగూపార చేతపట్టి ఎడాపెడా నేలను తవ్వేస్తుంటాడు. ఎవరో వచ్చి చెంబుతో నీళ్లిస్తే అక్కరలేదని చెయ్యి అడ్డంపెడతాడు. జేసీబీ ఎక్కి రయ్యిన పరుగులు పెట్టిస్తాడు. కాలువలు, ప్రాజెక్టులు ఒంటిచేత్తో కట్టేస్తుంటాడు. మధ్యలో త్రీడీ ఎఫెక్టులతో నీళ్లు జలజలా ప్రవహిస్తుంటాయి. పాతికేళ్లుగా గుజరాత్ ఆయన చేతుల్లోనే ఉంటే ఇప్పుడు నీళ్లివ్వడం ఏమిటో అర్థం కాదు. అయినా ఇప్పటికీ గుజరాత్లోని అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇవ్వడం లేదని అక్కడివారే అంటున్నారు.