అంత ఓర్పుతో వినే నేతను చూడలేదు: అమిత్ షా
న్యూఢిల్లీ: తాను చూసిన నేతల్లో ప్రధాని నరేంద్రమోదీ అత్యుత్తమ ప్రజాస్వామిక నాయకుల్లో ఒకరని కేంద్రహోంమంత్రి అమిత్ షా కొనియాడారు. బీజేపీ అధికారంలో, విపక్షంలో ఉన్నప్పుడు మోదీతో కలిసి పనిచేసే అవకాశం తనకు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మీడియా సంస్థ ‘సంసద్ టీవీ’ ఇంటర్వ్యూలో ఆదివారం అమిత్ షా పాల్గొన్నారు. ఈ క్రమంలో.. ‘మోదీ ఓ నియంత’ అని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయని యాంకర్ ప్రశ్నించడంతో అమిత్ షా పై విధంగా స్పందించారు. సమావేశాల్లో మోదీ తక్కువగా మాట్లాడటానికి ప్రయత్నిస్తారని, సభ్యులు చెప్పే విషయాలను ఎంతో సావదానంగా వింటారన్నారు. అంతటి సహనంతో వినే నేతను తాను ఇంతవరకూ చూడలేదన్నారు.