న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: అయోధ్య రామ మందిరం సాంస్కృతిక పునరుజ్జీవనానికి చిహ్నంగా నిలుస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. శనివారం లోక్సభలో అయోధ్య రామ మందిరంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ నవ భారత నిర్మాణానికి జనవరి 22 నాంది పలికినట్టు చెప్పారు. అయోధ్య రామమందిర తీర్మానం భవిష్యత్తు తరాలకు దేశ విలువలపై గర్వపడేలా రాజ్యాంగపరమైన ైస్థెర్యాన్ని ఇస్తుందని ప్రధాని మోదీ అన్నారు.
హిందూత్వం కోసమే మోదీ ప్రభుత్వం ఉందా: ఒవైసీ
మోదీ ప్రభుత్వం కేవలం హిందూత్వ కోసమే ఉందా? అని హైదరాబాద్ ఎంపీ అసదుదీన్ ఒవైసీ ప్రశ్నించారు. బాబ్రీ మసీదు అది కట్టిన స్థలంలోనే ఉంటుందని ఆయన అన్నారు. అయోధ్య రామాలయ చర్చలో ఆయన మాట్లాడుతూ బాబ్రీ మసీదు జిందాబాద్.. భారత్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
బాబ్రీ మసీదు కూల్చివేతకు కారకులైన ఇద్దరికి ప్రభుత్వం భారతరత్నలు ప్రకటించిందని ఆయన విమర్శించారు. 1992 డిసెంబర్ 6న జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతను పార్లమెంట్ ఖండించిందని గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం కేవలం హిందూవులకేనా లేదా యావత్ దేశానికా అని ఆయన ప్రశ్నించారు. దేశంలోని 17 కోట్ల మంది ముస్లింలు పరాయీకరణ భావంతో ఉన్నారని, ఈ దేశానికి ‘బాబా మోదీ’ అవసరం లేదని అన్నారు.
పార్లమెంట్ నిరవధిక వాయిదా
పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 17వ లోక్సభ శనివారం తన ఆఖరి సమావేశాన్ని ముగించింది. ఈ లోక్సభలో మొత్తం 222 బిల్లులు ఆమోదించినట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.