శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో అమాయక ప్రజలు, మైనార్టీలైన కశ్మీర్ పండిట్ల హత్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీరియస్గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రమూకల అంతు చూసేందుకు భద్రతా సంస్థలకు చెందిన ప్రత్యేక నిఫుణులను అక్కడకు పంపారు. పాకిస్థాన్ మద్దతుతో శ్రీనగర్లో ఉగ్ర దాడులకు పాల్పడుతున్న స్థానిక ఉగ్రవాదులను ఏరి వేసేందుకు టాప్ ఉగ్రవాద నిరోధక నిఫుణులు స్థానిక పోలీసులకు సహకరించనున్నారు.
పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ) మద్దతుతో ఏర్పడిన స్థానిక ది రెసిస్టెన్స్ ఫోర్స్ (టీఆర్ఎఫ్) శ్రీనగర్లో తాజాగా పలు ఉగ్ర దాడులకు పాల్పడింది. కశ్మీరీ పండిట్ ఫార్మసిస్ట్, స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్తోపాటు మరో ఇద్దరిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. పర్యాటకం ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న శ్రీనగర్లో జరిగిన పరిణామాలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గురువారం భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సుమారు ఐదు గంటలపాటు చర్చలు జరిపారు. ఉగ్రవాద నిరోధక నిపుణులను కశ్మీర్కు పంపాలని భద్రతా సంస్థలను ఆదేశించారు. అక్కడ వెంటనే సాధారణ పరిస్థితులు ఏర్పడేలా చూడాలని సూచించారు.
ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కి చెందిన ఉగ్రవాద నిరోధక (సీటీ) కార్యకలాపాల అధిపతి తపన్ శుక్రవారం కశ్మీర్ లోయకు బయలుదేరారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేపట్టే పోరాటాన్ని ఆయన వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తారు. మరోవైపు ఇతర జాతీయ భద్రతా సంస్థలకు చెందిన ఉగ్రవాద నిరోధక బృందాలు ఇప్పటికే కశ్మీర్ చేరుకున్నాయి. ఉగ్రవాదుల ఏరి వేతకు జమ్ముకశ్మీర్ పోలీసులకు సహకరించడంతోపాటు వారిని బలోపేతం చేయడంలో మరింత అండగా నిలుస్తాయి.