అమరావతి : ఏపీలోని తిరుపతి వేదికగా సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం కొనసాగుతున్నది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన భేటీ ప్రారంభం కాగా.. రాత్రి 7 గంటల వరకు జరుగనున్నది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో ఏపీ సీఎం జగన్ ప్రారంభ ఉపన్యాసం చేయనుండగా.. అజెండా సమావేశాలను అంతర్రాష్ట్ర వ్యవహారాల శాఖ కార్యదర్శి ప్రవేశపెట్టనున్నారు. చివరగా కేంద్ర హోంశాఖ మంత్రి ముగింపు ఉపన్యాసం చేయననున్నారు.
సమావేశం అజెండాలో 26 అంశాలు ఉండగా.. గత సమావేశ నిర్ణయాలకు సంబంధించి రెండు నివేదికలపై చర్చ జరుగనున్నది. అలాగే డైరెక్టర్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) మిషన్ అమలు, మహిళలు, పిల్లలపై లైంగిక నేరాల కేసుల్లో వేగవంతమైన విచారణ, జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLEP), పోషణ్ యోజన (NPY) కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి రాష్ట్రాల మద్దతుపై చర్చించనున్నారు. మూడు సంవత్సరాల విరామం తర్వాత జరుగుతున్న సదస్సులో దక్షిణాది రాష్ట్రాల మధ్య అనేక అంతర్రాష్ట్ర సమస్యలు కూడా చర్చకు రానున్నాయి. ఈ సందర్భంగా తర్వాత సమావేశం జరిగే వేదికను ఖరారు చేయడంతో పాటు 24 అంశాలపై భేటీలో చర్చించనున్నారు.
సమావేశానికి ఏపీ నుంచి సీఎం జగన్, తెలంగాణ నుంచి హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, తమిళనాడు నుంచి విద్యాశాఖ మంత్రి పొన్నమూడి, కేరళ నుంచి రెవెన్యూశాఖ మంత్రి రాజన్, కర్ణాటక నుంచి సీఎం బసవరాజు బొమ్మై, పుదుచ్చేరి నుంచి సీఎం రంగస్వామి, ఇన్చార్జి గవర్నర్ తమిళిసై, అండమాన్ నికోబార్ తరఫున లెఫ్టినెంట్ గవర్నర్ దేవ్ంద్ర కుమార్ జోషి, లక్ష్యద్వీప్ నుంచి అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా, అంతర్రాష్ట్ర మండలి సెక్రటేరియట్ కార్యదర్శి అనురాధ ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.