హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (ఎన్ఐఎస్ఏ)లో ఆదివారం నిర్వహించిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) రైజింగ్ డే పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
నిజానికి అమిత్షా మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడేందుకు సీఐఎస్ఎఫ్ అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో మీడియా ప్రతినిధులు దాదాపు అర్ధగంటపాటు ఆయన కోసం ఎదురుచూశారు. అయితే అమిత్షా అటువైపు కన్నెత్తి చూడకుండా వెళ్లిపోయేందుకు ప్రయత్నించడంతో తమతో మాట్లాడాలని మీడియా ప్రతినిధులు పట్టుబట్టారు. అయినప్పటికీ అమిత్షా తన వాహనం ఎక్కి వెళ్లిపోవడంతో కేంద్రమంత్రి కిషన్రెడ్డి మీడియాను సముదాయించే ప్రయత్నం చేశారు.
ఢిల్లీ వెలుపల తొలిసారి
సీఐఎస్ఎఫ్ రైజింగ్ డే పరేడ్ను ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి. పరేడ్ కమాండెంట్ అభిషేక్ చౌదరి ఆధ్వర్యంలో జవాన్లు కన్నుల పండువగా కవాతు ప్రదర్శించారు. ఈ సందర్భంగా అమిత్షా మాట్లాడుతూ.. దేశ ప్రజల భద్రతతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలకు రక్షణ కల్పించడంలో సీఐఎస్ఎఫ్ విశేష కృషి చేస్తున్నదని కొనియాడారు. అనంతరం 23 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందికి రాష్ట్రపతి గ్యాలెంట్రీ మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, సీఐఎస్ఎఫ్ డీజీ శీల్ వర్ధన్సింగ్, రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్, తదితరులు పాల్గొన్నారు.