న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షుడైన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కేంద్ర హోంమంత్రి అమిత్షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బుధవారం కలిసారు. దాదాపు గంట పాటు వీరి మధ్య భేటీ జరిగింది. అయితే ఈ సమావేశంలో ఏం చర్చించారనే దానిపై మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కమిటీ ఏర్పాటు తర్వాత ఇద్దరు మంత్రులు మర్యాదపూర్వకంగా కోవింద్ను కలిసినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
అయితే కమిటీ అధికారిక మొదటి సమావేశం వచ్చే వారం ఉండే అవకాశం ఉన్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఏకకాలంలో లోక్సభ, రాష్ర్టాల అసెంబ్లీలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేసి సిఫార్సులు చేసేందుకు మోదీ సర్కార్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో కేంద్ర హోమంత్రి అమిత్షా సభ్యుడిగా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్నారు.