గౌహతి: జనాభా గణాంకాల డిజిటలైజేషన్ తర్వలో ప్రారంభమవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆలస్యమైన ఈ ప్రక్రియను రానున్న జన గణనలో అమలు చేస్తామన్నారు. అలాగే జనన, మరణాల నమోదును జనాభా లెక్కలతో అనుసంధానం చేస్తామని చెప్పారు. దీంతో ఇకపై దేశంలో పుట్టే వారు ఆటోమేటిక్గా జనాభా లెక్కల్లో చేరుతారని, మరణింగానే ఆ జాబితా నుంచి తొలగిపోతారని వెల్లడించారు. దీని కోసం జనాభా గణన ప్రక్రియను మరింత శాస్త్రీయంగా నిర్వహించేందుకు ఆధునిక పద్ధతులను పాటించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించిందని వివరించారు.
అస్సాంలో డెరైక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ కార్యాలయ భవనాన్ని అమిత్ షా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాభివృద్ధికి మెరుగైన ప్రణాళిక కోసం సరైన జన గణన అవసరమని తెలిపారు. తదుపరి జనాభా లెక్కలు ఈ-సెన్సస్ అని చెప్పారు. వంద శాతం ఖచ్చితమైన జనాభా గణన జరుగుతుందని అన్నారు. దీని ఆధారంగా, రాబోయే 25 సంవత్సరాలకు సంబంధించిన దేశ అభివృద్ధి ప్రణాళిక జరుగుతుందన్నారు. జన గణన ఎంతో ముఖ్యమని, జనాభా సున్నితత్వం ఉన్న అస్సాం వంటి రాష్ట్రాలకు మరింత ముఖ్యమన్నారు.
జనాభా లెక్కలతో జనన, మరణాల నమోదును అనుసంధానం చేస్తామని అమిత్ షా తెలిపారు. ఇకపై పుట్టిన వెంటనే ఆటోమేటిక్గా జనాభా గణన రిజిస్టర్లో వివరాలు నమోదవుతాయని చెప్పారు. అతడు లేదా ఆమెకు 18 ఏళ్లు నిండిన తర్వాత, ఓటర్ల జాబితాలో పేరు చేరుతుందన్నారు. ఆ వ్యక్తి మరణించిన తర్వాత ఓటర్ రిజిస్టర్, జనాభా లెక్కల నుంచి ఆటోమేటిక్గా పేరు తొలగిపోతుందని చెప్పారు. పేరు, చిరునామా మార్పు సజావుగా ఉంటుందన్నారు. దీని కోసం అన్నీ అనుసంధానమవుతాయని, 2024 నాటికి ఇది అమలులోకి వస్తుందని వెల్లడించారు.