న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో జీ 20 సదస్సు (G20 Summit) జరుగనున్నది. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల కోసం వాహనాల కొరత ఏర్పడింది. దీంతో పోలీస్ అధికారుల వద్ద ఉన్న అదనపు ప్రభుత్వ వాహనాలను వెనక్కి ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం ఇటీవల పోలీస్ వాహనాల అడిట్ను నిర్వహించింది. పోలీస్ ఉన్నతాధికారులు సుమారు 118 వాహనాలను అధికంగా వాడుతున్నారని తేలింది.
కాగా, ఇతర జిల్లాలకు కేటాయించిన ప్రభుత్వ వాహనాలను పలువురు పోలీస్ అధికారులు తమ ఇష్టానుసారంగా వినియోగిస్తున్నట్లు తెలిసింది. పోలీస్ ఉన్నతాధికారులు అనధికారికంగా వాడుతున్న వాహనాల్లో 58 మారుతీ సుజుకి ఎరిట్గా ఎస్యూవీలు, 26 సియాజ్ సెడాన్లు, 10 మహీంద్రా స్కార్పియో ఎస్యూవీలు, టయోటా ఇన్నోవాస్, టాటా సఫారీ, మహీంద్రా బొలెరో, మారుతీ డిజైర్, హ్యుందాయ్ వెర్నా, మారుతి ఎస్ఎక్స్4 ఉన్నాయి.
మరోవైపు, పోలీస్ అధికారుల వద్ద ఉన్న ఈ అదనపు ప్రభుత్వ వాహనాలను వెంటనే తిరిగి ఇవ్వాలంటూ ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేసింది. దుర్వినియోగం చేస్తున్న ఈ వాహనాలను వెంటనే డిపార్ట్మెంట్కు అప్పగించాలని నోటీస్లో పేర్కొంది. అలాగే తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ వాహనాలకు పెట్రోల్ లేదా డీజిల్ సరఫరా ఉండబోదని ఆ లేఖలో స్పష్టం చేసింది.