బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో తాగునీటి వృథాపై అధికారులు చర్యలు చేపట్టారు. 22 కుటుంబాలకు రూ.5,000 చొప్పున జరిమానా విధించారు. లక్షకు పైగా వసూలు చేశారు. (Fined For Wasting Drinking Water) మరోసారి తాగు నీటి వృథాకు పాల్పడితే అదనంగా రూ.500 ఫైన్ విధిస్తామని హెచ్చరించారు. నీటి ఎద్దడి నేపథ్యంలో బెంగళూరు ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొంత మంది మాత్రం తాగునీటిని వృథా చేస్తున్నారు. కార్ల వాషింగ్, గార్డెనింగ్కు కూడా తాగునీటిని వినియోగిస్తున్నారు.
కాగా, బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డు (బీడబ్ల్యూఎస్ఎస్బీ) దీనిపై స్పందించింది. తాగునీటి వృథాకు పాల్పడిన 22 కుటుంబాలకు రూ.5,000 చొప్పున జరిమానా విధించింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి రూ.1.1 లక్షల జరిమానా వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఒక్క దక్షిణ ప్రాంతం నుంచే అత్యధికంగా రూ. 80,000 ఫైన్ వసూలు చేసినట్లు చెప్పారు. అలాగే హోలీ వేడుక సందర్భంగా నీటి వృథాకు పాల్పడవద్దని అధికారులు హెచ్చరించారు. పూల్ పార్టీలు, రెయిన్ డ్యాన్స్లకు దూరంగా ఉండాలని కావేరి, బోర్వెల్ నీటిని వినియోగించవద్దని సూచించారు.