ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవికి రాజీనామా చెయ్యాలని ఏక్నాథ్ షిండేకు చెప్పినట్లుగా తనకు తెలిసిందన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో ప్రభుత్వంలో మార్పులు జరుగుతాయని మీడియాతో అన్నారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఆ పార్టీలో తిరుగుబాటు చేసి తన వర్గంతో కలిసి ప్రభుత్వంలో చేరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఏక్నాథ్ షిండే వర్గాన్ని బీజేపీ పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది. అలాగే అజిత్ పవార్ వర్గానికి ప్రాముఖ్యత ఇచ్చి ఆయనను సీఎం చేసేందుకు బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం.
కాగా, అజిత్ పవార్ వర్గం ప్రభుత్వంలో చేరినప్పటి నుంచి ఏక్నాథ్ షిండే వర్గం చాలా అసంతృప్తితో ఉన్నట్లు శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తెలిపారు. ఈ నేపథ్యంలో సుమారు 20 మంది షిండే వర్గం ఎమ్మెల్యేలు తమను సంప్రదించినట్లు చెప్పారు. మరోవైపు సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా చేయబోరని ఆయన వర్గం తెలిపింది. ఎమ్మెల్యేలు, ఎంపీలకు షిండేపై పూర్తి నమ్మకం ఉందని ఆయన వర్గం నేత ఉదయ్ సామంత్ తెలిపారు. షిండే ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఇలాంటి వదంతులను వ్యాప్తి జేస్తున్నారని విమర్శించారు.
#WATCH | Mumbai: "I have heard that CM (Eknath Shinde) has been asked to resign and there might be some change (in the govt), says Uddhav Thackeray faction leader Aaditya Thackeray (07.07) pic.twitter.com/IBW7HNfmoB
— ANI (@ANI) July 7, 2023