సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని అధికార కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతున్నది. (Himachal Congress Crisis) కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ బీజేపీపై ప్రశంసలు కురిపించారు. తమ పార్టీ పని తీరు కంటే బీజేపీ పని తీరు చాలా బాగున్నదని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ముగిసిందని ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ప్రకటించిన మరుసటి రోజే మీడియాతో మాట్లాడిన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ పని తీరు కంటే బీజేపీ పని తీరు చాలా బాగున్నదని ప్రతిభా సింగ్ శుక్రవారం అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు బీజేపీ చాలా మంచి పనులు చేస్తున్నదని కితాబు ఇచ్చారు. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్లో ఇంకా చాలా పనులు చేయాల్సి ఉందన్నారు. ‘మన (కాంగ్రెస్) పని కంటే బీజేపీ పని మెరుగ్గా ఉందన్నది నిజం’ అని ఆమె వ్యాఖ్యానించారు.
కాగా, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తేనే వచ్చే ఎన్నికలను ఎదుర్కోగలమన్నది మొదటి రోజు నుంచి సీఎంకు తాను చెబుతున్నానని ప్రతిభా సింగ్ అన్నారు. క్షేత్రస్థాయిలో చాలా సమస్యలు కనిపిస్తున్నాయన్న ఆమె ఇది తమకు చాలా కష్టమైన పరిస్థితి అని తెలిపారు. ‘ప్రధాని మోదీ ఆదేశాల మేరకు బీజేపీ చాలా పనులు చేస్తోంది. మనం బలహీనంగా ఉన్నాం. పార్టీని బలోపేతం చేయాలని, పార్టీని వ్యవస్థీకరించాలని పదే పదే ఆయన (సీఎం)ను కోరా. ఇది కష్టమైన సమయం. అయినా ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి’ అని అన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటు వేసిన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో ఆమె కుమారుడు విక్రమాదిత్య సింగ్ సమావేశమైన కొన్ని గంటల తర్వాత ప్రతిభా సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.