పాట్నా: బీహార్ రాజకీయాలు మరోసారి గందరగోళంగా మారాయి. (Bihar Political Turmoil ) జేడీ(యూ) చీఫ్, సీఎం నితీశ్ కుమార్ మళ్లీ బీజేపీ పంచన చేరుతున్నారు. ఆర్జేడీ నేతృత్వంలోని ప్రభుత్వం నుంచి వైదొలగాలని భావిస్తున్నారు. ఎన్టీయే కూటమితో కలిసి ఆదివారం మరోసారి సీఎంగా ప్రమాణం చేయాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీహార్కు చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) వ్యవస్థాపకుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. ఆయన పార్టీ ఇండియా బ్లాక్లో చేరాలని కోరారు. అలాగే బీహార్ పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుడు భూపేష్ బఘేల్ కూడా మాంఝీతో నేరుగా సమావేశం కానున్నట్లు తెలుస్తున్నది.
కాగా, బీహార్లో ఆర్జేడీ నేతృత్వంలోని ప్రభుత్వం నుంచి జేడీ(యూ) వైదొలగనున్న నేపథ్యంలో కొత్త రాజకీయ సమీకరణలు తెరపైకి వస్తున్నాయి. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సంఖ్య 122. ఆర్జేడీకి 79 మంది, బీజేపీకి 78 మంది, జేడీ(యూ)కు 45 మంది, కాంగ్రెస్కు 19, సీపీఐ(ఎంఎల్)ఎల్కు 12, సీపీఐకు 2, సీపీఎంకు 2, హెచ్ఏఎంకు నలుగురు సభ్యులతోపాటు ఒక ఐఏఎంఐఎం, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలున్నారు.
మరోవైపు ప్రస్తుతం బీహార్లో బీజేపీ 78, హెచ్ఏఎం నలుగురు సభ్యులతో కలిసి ఎన్డీయే కూటమి బలం 82. ఈ నేపథ్యంలో జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హెచ్ఏఎం ప్రసుత్తం కీలకంగా మారింది. దీంతో ఆ పార్టీని తమ వైపు ఆకట్టుకునేందుకు కాంగ్రెస్, ఆర్జేడీ ప్రయత్నిస్తున్నాయి. మాంఝీ కుమారుడికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని ఆర్జేడీ చీఫ్ లాలూ యాదవ్ ప్రతిపాదించినట్లు సమాచారం.