న్యూఢిల్లీ: పార్లమెంటు, శాసనసభల సభ్యులపై నమోదైన క్రిమినల్ కేసుల్లో దాదాపు 2,000 కేసులను 2023లో ప్రత్యేక కోర్టులు పరిష్కరించాయి. సీనియర్ అడ్వకేట్ విజయ్ హన్సారియా ఓ అఫిడవిట్లో ఈ వివరాలను సుప్రీంకోర్టుకు తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసులను సత్వరం పరిష్కరించాలని కోరుతూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారణలో అమికస్ క్యూరీగా విజయ్ వ్యవహరిస్తున్నారు.
ఈ కేసుల్లో వేగంగా తీర్పులు రావాలంటే మరిన్ని ఆదేశాలను జారీ చేయడం అవసరమని, సంబంధిత హైకోర్టుల పర్యవేక్షణ తప్పనిసరి అని ఈ అఫిడవిట్లో విజయ్ తెలిపారు. లోక్సభ తొలి రెండు విడతల ఎన్నికల్లో పోటీ చేస్తున్న 501 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.
వీరిలో 327 మందిపై తీవ్ర నేరారోపణలు విచారణలో ఉన్నాయని, ఈ నేరాలు రుజువైతే, వారికి కనీసం ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని చెప్పారు. 2019లో క్రిమినల్ కేసులుగలవారే ఎక్కువ మంది ఎన్నికయ్యారని గుర్తు చేశారు. అందుకే పెండింగ్ కేసులను మరింత వేగంగా పరిష్కరించేందుకు తగిన ఆదేశాలను జారీ చేయాలని సుప్రీంకోర్టును కోరారు.