న్యూఢిల్లీ: చైనా అనుకూల సమాచారాన్ని భారత్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారీగా నగదు స్వీకరించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఆన్లైన్ పోర్టల్ న్యూస్క్లిక్ (NewsClick) వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. న్యూస్క్లిక్ టెర్రర్ కేసులో అమెరికాకు చెందిన మిలియనీర్ నెవిల్లీ రాయ్ సింఘంకు (Neville Roy Singham) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీచేసింది. విచారణకు రావాలంటూ విదేశీ వ్యవహారాల శాఖ (MEA) ద్వారా చైనాలో (China) ఉంటున్న సింఘంకు తాఖీదులచ్చింది. చైనా గురించి ప్రచారం చేసేందుకు ఆయన న్యూస్క్లిక్కు భారీ మొత్తంలో నిధులు అందించినట్లు వార్తలు వెలువడిన విషయం తెలసిందే. చైనా సర్కారుతో కలిసి పనిచేశాడని, ఆ నెట్వర్క్తో అతను ఎన్జీవో, షెల్ కంపెనీల ద్వారా చైనా గురించి ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్ చట్టం కింద ఆయనకు సమన్లు జారీ చేసింది.
న్యూస్క్లిక్పై ఈ ఏడాది ఆగస్టు 17న ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. 2009లో ప్రారంభమైన ఈ వెబ్సైట్లో న్యూస్ కంటెంట్తోపాటు కరెంట్ అఫైర్స్ను అప్లోడ్ చేస్తుంటారు. అయితే విదేశీ నిధుల చట్టాన్ని ఉల్లంఘించినట్లు సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో అక్టోబర్ మొదటివారంలో వెబ్సైట్ ఎడిటర్ ప్రబిర్ పుర్కయస్తా ఇంటితోపాటు జర్నలిస్టులు అభిసర్ శర్మ, అనింద్యో చక్రవర్తి, భాషా సింగ్, సెటైరిస్టు సంజయ్ రాజౌరా, చరిత్రకారుడు సోహెయిల్ హస్మిల ఇండ్లలో పోలీసుతు సోదాలు నిర్వహించారు. దీని ఆధారంగా కేసు నమోదుచేసిన సీబీఐ.. న్యూస్క్లిక్ ప్రధాన కార్యాలయంతోపాటు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేసింది. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు.