న్యూఢిల్లీ: ఇండియాలో పర్యటనకు వచ్చి 58 ఏళ్ల క్రితం ప్రాణాలు విడిచిన అమెరికా మేజర్ జనరల్ హ్యారీ క్లెయిన్బెక్ పిక్కెట్(Major General Pickett) అవశేషాలను ఆయన స్వదేశానికి పంపారు. 1965లో డార్జిలింగ్లో మేజర్ జనరల్ హ్యారీ మరణించారు. అయితే అప్పట్లో ఆయన పార్డీవదేహాన్ని అక్కడే క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. కానీ మేజర్ హ్యారీ మృతదేహాన్ని అప్పగించాలని అప్పటి నుంచి ఆయన ఫ్యామిలీ డిమాండ్ చేస్తోంది. ఎట్టకేలకు ఇటీవల ఆయన శవపేటికను అమెరికాకు చేర్చారు. అర్లింట్టన్ నేషనల్ సిమెట్రీలో మళ్లీ ఖననం చేయనున్నారు.
మొదటి, రెండో ప్రపంచ యుద్ధంలో పనిచేసిన మేజర్ జనరల్ పిక్కెట్ .. డార్జిలింగ్లో టూర్ చేస్తున్నప్పుడు గుండెపోటు వచ్చి మరణించారు. అయితే సంప్రదాయం ప్రకారం ఆయన శరీరాన్ని ఖననం చేశారు. కానీ ఆయన అవశేషాలు తమకు కావాలని మేజర్ కుటుంబం అప్పటి నుంచి డిమాండ్ చేస్తూనే ఉంది. దాదాపు ఆరు దశాబ్ధాల తర్వాత పిక్కెట్ కుటుంబానికి ఆయన శవపేటిక చేరింది.
భారత దౌత్యకార్యాలయం చేసిన సహాయానికి అంబాసిడర్ ఎరిక్ గార్సెటీ థ్యాంక్స్ తెలిపారు. భారత కేంద్ర ప్రభుత్వానికి తాము రుణపడి ఉన్నామని కోల్కతాలోని యూఎస్ కాన్సులేట్ జనరల్ మెలిండా పావెక్ చెప్పారు.
మేజర్ జనరల్ పిక్కెట్ 1913లో మెరైన్ కార్ప్స్లో చేరారు. రెండు ప్రపంచ యుద్ధాల్లో ఆయన అమెరికా తరపున పోరాడారు. 1941లో పెరల్ హార్బర్పై జరిగిన దాడి సమయంలో జపాన్ విమానాలపై పిక్కెట్ ఫైరింగ్ జరిపారు.