న్యూఢిల్లీ/ఇంఫాల్: కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంటే అభివృద్ధి పరుగులు తీస్తుందంటూ ప్రధాని మోదీ, బీజేపీ నేతలు తరచూ ఊదరగొడుతుంటారు. అయితే అభివృద్ధి సంగతి దేవుడికెరుక.. డబుల్ ఇంజిన్ రాష్ర్టాల్లో అల్లర్లు మాత్రం డబుల్ అయ్యాయని విశ్లేషకులు అంటున్నారు. మణిపూర్, హర్యానా ఘర్షణలే అందుకు ఉదాహరణ. తాజాగా మధ్యప్రదేశ్లోని సెహోర్ జిల్లా బర్ఖేడా కుర్మి గ్రామంలో బజరంగ్దళ్ నిర్వహించిన ఊరేగింపు సందర్భంగా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఐదుగురు నిందితులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి, అనంతరం తమపై దాడులకు దిగారని దళితులు వాపోయారు.
మణిపూర్, హర్యానాల్లో జరుగుతున్న హింసకు సీఎంలు బాధ్యులు కాదని చెప్పడానికి బీజేపీ అధిష్ఠానం పడరాని పాట్లు పడుతున్నది. ఆందోళనకారుల చేతికి ఆయుధాలెలా వచ్చాయో చెప్పలేకపోతున్నది. మణిపూర్లో అల్లర్లకు మాదక ద్రవ్యాలే కారణమంటూ బుకాయిస్తున్నది. మరోవైపు మణిపూర్, హర్యానాల్లో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలే విభజన రాజకీయాలు చేస్తూ హింసను ఎగదోస్తున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బీజేపీకి ప్రభుత్వాలను నడపడం చేత కాదని శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఇదేనా రామరాజ్యం? అని ప్రశ్నించారు.
బీజేపీ చేతుల్లో దేశం సురక్షితంగా లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా అభిప్రాయపడ్డారు. మణిపూర్, హర్యానాల్లో హింసను బీజేపీ ప్రభుత్వాలు అదుపు చేయలేకపోతున్నాయని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మణిపూర్ హింసపై ఆ రాష్ట్ర మహిళా గవర్నర్ ఆవేదన వ్యక్తం చేస్తారు.. తప్ప రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయరని ఎద్దేవా చేశారు. ఢిల్లీ పాలనాధికారాల బిల్లును తొలుత ఢిల్లీపై ప్రయోగించిన కేంద్రం.. భవిష్యత్తులో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న అన్ని రాష్ర్టాలపైనా ప్రయోగిస్తుందని హెచ్చరించారు. ఈ ధర్మ యుద్ధంలో ధర్మం తమ వైపు, అధర్మం బీజేపీ వైపు ఉన్నదని వ్యాఖ్యానించారు.